న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ( Shivraj Singh Chouhan) మంగళవారం ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నడ్డాతో చౌహాన్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం అనంతరం చౌహాన్ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన తొలిసారిగా ఢిల్లీకి వచ్చారు. ఇక నడ్డాతో భేటీతో శివరాజ్ చౌహాన్కు కీలక పదవి దక్కనుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశంలో తాము దేశ పురోభివృద్ధి, ప్రజా సంక్షేమ, సామాజిక సేవా కార్యక్రమాలపై చర్చించామని భేటీ అనంతరం చౌహాన్ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.
పార్టీ కార్యకర్తగా బీజేపీ అగ్రనాయకత్వం తనకు అప్పగించే బాధ్యతలను నిర్వర్తిస్తానని నడ్డాతో భేటీ అనంతరం చౌహాన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తాను రాష్ట్రంలో పనిచేయాలా లేక జాతీయ స్ధాయి బాధ్యతలు చేపట్టాలా అనేది పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు. రాష్ట్ర శాసనసభాపక్ష తొలి సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నందున తాను సాయంత్రం భోపాల్ తిరుగు పయనమవుతానని చౌహాన్ పేర్కొన్నారు. నాలుగుసార్లు సీఎంగా పనిచేసి ప్రముఖ ఓబీసీ నేతగా ఎదిగిన శివరాజ్ చౌహాన్కు పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా బీజేపీ నియమించనుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
పార్లమెంట్ ఎన్నికలు కేవలం కొద్ది నెలల దూరంలోనే ఉన్నందున ఆయనకు కేంద్ర మంత్రి పదవి లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆ వర్గాలు వెల్లడించాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చౌహాన్ను విదిశ లోక్సభ స్ధానం నుంచి బరిలోకి దింపవచ్చని భావిస్తున్నాయి. కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే చౌహాన్ను కేంద్ర క్యాబినెట్లోకి తీసుకుంటారని చెబుతున్నారు.
Read More :
Parliament: ఇవాళ 49.. టోటల్గా 141 మంది లోక్సభ ఎంపీలపై సస్పెన్షన్..రికార్డ్ బ్రేక్..!!