Mallikarjun Kharge : మూడు వ్యవసాయ చట్టాల నిలిపివేత మోదీ ఎత్తుగడని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఈ మూడు నల్ల చట్టాల రద్దుకు సంబంధించి నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదని, 2024లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ చట్టాలను రద్దు చేస్తుందని హామీ ఇచ్చారు. కనీస మద్దతు ధరపై చట్టం సహా పలు డిమాండ్ల సాధన కోసం కొన్ని రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ఛలో ఢిల్లీకి పిలుపు ఇచ్చిన నేపధ్యంలో ఖర్గే ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
గత పదేండ్లుగా మోదీ సర్కార్ రైతులు, కార్మికులను దగా చేసిందని పంజాబ్లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సదస్సులో ఖర్గే ఆరోపించారు. అన్నదాతలు ఢిల్లీ సరిహద్దుల్లో రోడ్లపై కూర్చుంటే ఏ ఒక్కరూ వారితో మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు వివాదాస్పద సాగు చట్టాలను నిలిపివేసినా వాటి రద్దుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటివరకూ విడుదల కాలేదని ఖర్గే అన్నారు.
ఇది మోదీ ఎత్తుగడని, కేంద్ర ప్రభుత్వం దేశానికి వెన్నెముక వంటి రైతాంగం, యువత వెన్నువిరిచిందని కాషాయ పాలకులపై విరుచుకుపడ్డారు. తమ హక్కుల సాధన కోసం మళ్లీ దేశ రాజధాని బాటపట్టిన పంజాబ్ రైతాంగాన్ని తాను అభినందిస్తున్నానని ఖర్గే అన్నారు. రైతుల భూములను బడా కార్పొరేట్లకు దోచిపెట్టే చట్టాలను బీజేపీ తీసుకొచ్చిందని, ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా తాము పోరాటం చేశామని, భవిష్యత్లోనూ తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
Read More :