న్యూఢిల్లీ : విపక్షాలు తమ కూటమికి ఇండియా పేరు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఈస్టిండియా కంపెనీ వ్యాఖ్యలను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు. విపక్షాలు ఇండియా అని పేరుపెట్టుకుంటే మోదీ ఎందుకు ఉలికిపడుతున్నారని ప్రశ్నించారు. పట్నా, బెంగళూర్లో ప్రతిపక్షాలు విజయవంతంగా సమావేశాలు నిర్వహించడంతో బీజేపీలో వణుకు మొదలైందని అన్నారు.
విపక్షాలు ఏకం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీకి దిక్కుతోచడం లేదని ఎద్దేవా చేశారు. పార్లమెంట్కు వచ్చి మణిపూర్ అల్లర్లపై మాట్లాడాలని తాము ప్రధాని నరేంద్ర మోదీని కోరితే ఏం మాట్లాడాలి..ఏం చేయాలనే దానిపై ప్రధానికి పాలుపోవడం లేదని అన్నారు.
మణిపూర్ ఘటనలపై పార్లమెంట్ వెలుపల మాట్లాడిన మోదీ పార్లమెంట్ లోపల ఈ విషయంపై సమగ్ర చర్చ చేపట్టి అక్కడి పరిస్ధితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు వివరించాలని ఖర్గే డిమాండ్ చేశారు. మణిపూర్ వ్యవహారాన్ని రాజస్ధాన్, చత్తీస్ఘఢ్, పశ్చిమ బెంగాల్ వంటి బీజేపేయేతర రాష్ట్రాల్లో జరిగిన ఘటనలతో పోల్చలేమని చెప్పారు. దేశంలో ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ మణిపూర్ అల్లర్లు ఆందోళన రేకెత్తిస్తాయని అన్నారు. మహిళలపై జరుగుతున్న వేధింపుల గురించి కాషాయ పాలకులకు పట్టడం లేదని ఆరోపించారు.
Read More :