అహ్మదాబాద్ : రోజూ పనిచేసి పొట్టపోసుకునే పేద కార్మికులకు అత్యంత విలువైన పురాతన బంగారు నాణేలు దొరకగా తీరా వాటిపై ఖాకీల కన్నుపడింది. కూలీల ఇంటిపై దాడికి తెగబడిన ఖాకీలు ఆ నాణేలను గుంజుకుని పరారైన ఘటన దుమారం రేపుతోంది. గుజరాత్లో ఓ పాత ఇంటిని కూల్చేస్తున్న కార్మికులకు బ్రిటిష్ హయాం నాటి 240 బంగారు నాణేలు లభ్యం కాగా వారు వాటిని మధ్యప్రదేశ్కు తీసుకువచ్చారు.
మధ్యప్రదేశ్లో నలుగురు పోలీసులు వారి నుంచి ఆ గోల్డ్ కాయిన్స్ తస్కరించారు. ఒక్కో గోల్డ్ కాయిన్ రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకూ పలుకుతుందని అంచనా. గోల్డ్ కాయిన్స్ను కాజేసిన నలుగురు పోలీసులు అదృశ్యమయ్యారు. ఈ కేసును విచారించేందుకు మధ్యప్రదేశ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. గుజరాత్లోని నవ్సారి జిల్లాలో ఓ పాత ఇంటిని తనతో పాటు తన కుటుంబసభ్యులు కూల్చివేస్తుండగా పురాతన గోల్డ్ కాయిన్స్ కనిపించాయని మధ్యప్రదేశ్లోని అలిరాజ్పూర్ జిల్లాకు చెందిన రంకుబాయ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. చోరీ కాకుండా మిగిలిన ఓ గోల్డ్ కాయిన్ను ఆమె పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లింది.
1922లో బ్రిటిష్ మింట్లో ముద్రించిన లిమిటెడ్ ఎడిషన్ కాయిన్కు చెందిన నాణేలుగా వీటిని గుర్తించారు. ఈ నాణెం ఒక్కోటి 7.08 గ్రాముల బరువుండగా దానిపై ఆరవ కింగ్ జార్జ్ ఫొటో ముద్రించారు. ఈ నాణెంలో బంగారం వెయిట్ 90 శాతం వరకూ ఉందని గుర్తించారు. కాయిన్స్ అన్నీ ఇలాగే ఉండవచ్చని సిట్ అంచనా వేస్తోంది. తాము 240 గోల్డ్ కాయిన్స్ను తమ గ్రామానికి తీసుకువచ్చి తమ ఇంట్లో పాతిపెట్టామని రుకుంబాయ్ తెలిపింది.
ఈ విషయం పోలీసుల చెవినపడటంతో ఈనెల 19న సొండ్వ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ విజయ్ దేవ్దా కానిస్టేబుళ్లు రాకేష్, వీరేంద్ర, సురేంద్రలతో కలిసి యూనిఫాం లేకుండా, ప్రైవేట్ వాహనంలో రుకుంబాయ్ ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులపై దౌర్జన్యం చేసి గోల్డ్ కాయిన్స్ స్వాధీనం చేసుకుని పరారయ్యారు. మరుసటి రోజు రుకుంబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. చోరీకి గురైన గోల్డ్ కాయిన్స్ను రికవరీ చేసేందుకు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Read More :