న్యూఢిల్లీ : 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో జట్టు కట్టబోమని జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవెగౌడ (HD Deve Gowda) స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. దేవెగౌడ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2024 లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ జేడీఎస్ కలిసి పోటీచేయబోదని తేల్చిచెప్పారు.
జేడీఎస్ ఎన్నటికీ మునిగే నావ కాదు..తాము ఏ పార్టీ సాయం కోరబోమని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని పేర్కొన్నారు. కాగా సార్వత్రిక ఎన్నికల్లో తాము బీజేపీతో కలిసి పోటీ చేస్తామని దేవెగౌడ కుమారుడు, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి సంకేతాలు పంపిన క్రమంలో మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
మరోవైపు కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు బీజేపీ, జేడీఎస్ కుట్ర పన్నుతున్నాయని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన ఆరోపణలు కలలం రేపాయి. కర్నాటకలో సిద్ధరామయ్య సర్కార్ను కూల్చేందుకు కుట్రకు తెరలేపే ప్రణాళికలు రూపొందించేందుకు ఇరు పార్టీల నేతలు సింగపూర్ వెళ్లారని డీకే ఆరోపించారు. ఈ దిశగా బీజేపీ, జేడీఎస్ నేతలు ఓ ఒప్పందానికి వచ్చారని అన్నారు. తమ శత్రు పార్టీలు ఇప్పుడు స్నేహితులుగా మారి తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.
Read More :