Viral news : అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులను ఓ నేరస్తుడు ముప్పుతిప్పలు పెట్టాడు. ఓ బిల్డింగులోని ఐదో అంతస్తులో ఉన్న తన ఫ్లాట్కు పోలీసులు రాగానే అతడు కిచెన్ బాల్కనీలో నుంచి బయట ఉన్న ఎడ్జ్పైకి దిగాడు. తలుపు బద్దలు కొట్టి ఫ్లాట్ లోపలికి వెళ్లిన పోలీసులకు అతడు వార్నింగ్ ఇచ్చాడు. తన దగ్గరికి వస్తే పైనుంచి కిందకు దూకి చస్తానని బెదిరించాడు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అభిషేక్ అలియాస్ సంజయ్ సింగ్ తోమర్ అలియాస్ షూటర్ అనే వ్యక్తి దాడులు, అల్లర్లు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం లాంటి పలు కేసులలో వాంటెడ్ నేరగాడిగా ఉన్నాడు. ఈ క్రమంలో గురువారం అభిషేక్ అహ్మదాబాద్లోని ఓ భవనం ఐదో అంతస్తులోగల తన ఫ్లాట్లో ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు ఆ ఫ్లాట్కు వెళ్లారు. అయితే పోలీసుల రాకను పసిగట్టిన అభిషేక్ ఫ్లాట్ లోపలి నుంచి గడియపెట్టుకున్నాడు.
పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వచ్చేలోగా కిచెన్ బాల్కనీలో నుంచి బయట ఉన్న ఎడ్జ్పైకి దిగాడు. బాల్కనీలోకి వచ్చిన పోలీసులు అతడిని పైకి రమ్మని ఎంత హెచ్చరించినా మాట వినలేదు. పైగా తన దగ్గరకు వస్తే కిందకు దూకి చస్తానని బెదిరించాడు. ఈ సందర్భంగా పోలీసులతో తనకు జరుగుతున్న వాగ్వాదాన్ని తన మొబైల్లో రికార్డు చేస్తూ సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమింగ్ పెట్టాడు. దాదాపు మూడు గంటలపాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. అఖరికి అదనపు బలగాలను రప్పించి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.