పలు మండలాల్లో మోస్తరు వాన
అపరాలు, వాణిజ్య పంటలకు ప్రాణం
48, 578 ఎకరాలకు చేరిన సాగు
ఖమ్మం వ్యవసాయం, జూన్ 27: ఖమ్మం నగరంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పలు మండలాల్లో ఓ మోస్తరు వాన కురిసింది. దీంతో అపరాలు, వాణిజ్య పంటలకు ప్రాణం పోసినట్లయింది. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి దాదాపుగా 30 రోజులు కావస్తున్నప్పటికీ వరదలా పారే వర్షం మాత్రం కురవలేదు. అడపాదడపా వచ్చే వర్షాలను ఆసరగా చేసుకొని జిల్లా రైతులు సాగు ప్రక్రియ ప్రారంభించారు. ఎట్టకేలకు ఆదివారం సాయంత్రం నుంచి జిల్లా వ్యాప్తంగా దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. తద్వారా రాత్రి వేళ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దాదాపు 40 నిమిషాల పాటు నిరంతరాయంగా కురిసిన వర్షానికి నగరం తడిసి ముద్దయింది. దీంతో ఆయా కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. నగరంలోని బస్టాండ్ సెంటర్, మయూరిసెంటర్, పీఎస్ఆర్ రోడ్డు, కమాన్బజార్, చర్చికంపౌండ్ ఏరియాల్లోని ప్రధాన వీధుల్లోకి వరద నీరు వచ్చి చేరింది. నగరంతోపాటు శివారు మండలాలైన రఘునాథపా లెం, చింతకాని, కొణిజర్ల, ఖమ్మం రూరల్లో భారీ వర్షమే కురిసింది. రెండు రోజుల నుంచి అక్కడక్కడా కురుస్తున్న వర్షాలకు సాగు చేసిన అపరాలు, పత్తి పంటలకు ప్రాణం పోసినట్లయింది. నేటి వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 48,578 ఎకరాల్లో రైతులు విత్తనాలు విత్తుకున్నారు. వరి నార్లు పోసుకొని ఉన్నారు. ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలు కలిపి 5,96 149 ఎకరాల్లో సాగు కావచ్చని జిల్లా వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందులో భాగాంగా ఇప్పటి వరకూ వరి నార్లు 4,124 ఎకరాలు, మక్క సాగు 12 ఎకరాలు, పెసర 5,228 ఎకరాలు, మినుము 15 ఎకరాలు, కంది 192 ఎకరాలు, వేరుశనగ 3ఎకరాలు, పత్తి 36,523 ఎకరాలు, చెరుకు 826 ఎకరాల్లో సాగు మొదలైంది. 16,965 ఎకరాల కోసం వరి నారుమళ్లు పోసుకున్నారు. రానున్న వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో సాగు పనులు మరింత ముమ్మరం కానున్నాయి.