వరంగల్, జూలై 13 : ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ వరంగల్, హన్మకొండ జిల్లాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంతో గ్రేటర్లో పలువురు నాయకులు సంబురాలు జరుపుకున్నారు. మంగళవారం వివిధ డివిజన్లలో కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో కేసీఆర్ చిత్రపటానికి కార్పొరేటర్లతో కలిసి మేయర్ గుండు సుధారాణి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు జిల్లాలు వేగంగా అభివృద్ధి చెందడానికి గొప్ప ముందడుగు పడిందన్నారు. హన్మకొండ, వరంగల్ జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన పాలన అందించే వెసులుబాటు కలుగుతుందన్నారు. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ఈ జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతాయన్నారు.
కొత్తగా సవరణలతో జిల్లాలు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సహకరించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్యకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. రెండు జిల్లాల చారిత్రక నేపథ్యం మరింత విరాజిల్లేలా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవరకొండ విజయలక్ష్మి, మరుపల్ల రవి, సిరంగి సునీల్కుమార్, ఆకులపల్లి మనోహర్, ఇండ్ల నాగేశ్వర్రావు, దాస్యం అభినవ్ భాస్కర్, ఎలకంటి రాములు, నెక్కొండ కవిత, జక్కుల రజిత, సుంకరి మనీష, జన్ను షీబారాణి, ఆవాల రాధికారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దేవరకొండ సురేందర్, సుంకరి శివ, జన్ను అనిల్, తూర్పాటి సారయ్య పాల్గొన్నారు.