మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం కిడ్నీలు. మన శరీరంలోని మలినాలను వడపోసి, రక్తాన్ని శుద్ధి చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. కిడ్నీల పనితీరు బాగున్నప్పుడే ఆరోగ్యంగా ఉండొచ్చు. లేకపోతే అవయవాలు పనితీరు దెబ్బతిని.. అనారోగ్యాలకు గురవుతుంటాం. అందుకే మూత్ర పిండాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కిడ్నీ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మార్చి 11న అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మూత్రపిండాల ఆరోగ్యం కోసం పాటించాల్సిన జాగ్రత్తలు మీకోసం..
ఎంత ఎక్కువ నీరు తాగితే ఆరోగ్యానికి అంత మంచిది. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీల వడపోత సమయంలో మలినాలు సులభంగా తొలగిపోతాయి. కిడ్నీల సమస్యలు తగ్గి, పనితీరు మెరుగుపడుతుంది. అందుకే రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి.
చాలామంది చిన్నచిన్న సమస్యలకు నొప్పి నివారణ మందులను వాడుతుంటారు. ఇవి తాత్కాలికంగా ఉపశమనం కలిగించినప్పటికీ, కిడ్నీల ఆరోగ్యాన్ని మాత్రం చాలా దెబ్బతీస్తాయి. పెయిన్ కిల్లర్ మందుల్లో ఉండే కొన్ని రసాయనాలు.. నేరుగా మూత్రపిండాలకు చేరి ఫిల్టర్లను నాశనం చేస్తాయి. దీంతో కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. అందుకే అనవసరంగా, వైద్యుల సూచనలు లేకుండా పెయిన్కిల్లర్స్ వాడకపోవడమే మంచిది.
మందు, సిగరెట్లు అధికంగా తాగడం వల్ల శరీరంలో టాక్సిన్లు ఎక్కువ మొత్తంలో పెంచుతాయి. ధూమపానం వల్ల రక్తపోటు, హృదయ స్పందనలు పెరుగుతాయి.. మూత్ర పిండాలకు రక్త ప్రవాహం తగ్గుతుంది. దీనివల్ల కిడ్నీల ఒత్తిడి పెరిగి.. వాటి పనితీరు మందగిస్తుంది. కాబట్టి ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోవడం వల్ల అధిక బరువు పెరుగుతారు. శరీరంలో పేరుకుపోయిన ఈ టాక్సిన్లను శుభ్రం చేసే క్రమంలో మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కిడ్నీల పనితీరు మందగిస్తుంది. అందుకే అధిక బరువు పెరగడానికి కారణమయ్యే జంక్ఫుడ్కు దూరంగా ఉండాలి.
రక్తంలో షుగర్ లెవల్స్ అధికంగా ఉంటే కిడ్నీలకు వడపోత క్లిష్టంగా మారుతుంది. ఇలాగే చాలాకాలం చక్కెర నిల్వలు ఎక్కువైతే మూత్రపిండాలు చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రక్తంలో చక్కెరస్థాయులు అదుపులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి తినే ఆహారం, పానీయాల్లో చక్కెర నిల్వలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
రక్తపోటుతో గుండెజబ్బులే కాకుండా కిడ్నీల సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. రక్తపోటు కారణంగా శరీరంలో రక్తం ప్రవహించే వేగం పెరుగుతుంది. కిడ్నీలకు వేగంగా రక్తం రావడం వల్ల ఫిల్టర్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. కాబట్టి ఆహారంలో ఉప్పును తక్కువ మోతాదులో తీసుకోవాలి.
ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినడంతో పాటు వ్యాయామం చేయడం కూడా తప్పనిసరి. వ్యాయమం చేయడం ద్వారా చెమట రూపంలో మలినాలు బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల మూత్రపిండాల మీద ఒత్తిడి తగ్గుతుంది. వాటి పనితీరు మెరుగుపడుతుంది.