చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
మేయర్ గుండు సుధారాణితో కలిసి ఉచిత భోజన వసతి ప్రారంభం
వరంగల్, మే 13 : కరోనా కాలంలో పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గురువారం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు ఉచిత భోజన వసతి కార్యక్రమాన్ని మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్విప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తున్నదన్నారు. లాక్డౌన్ సమయంలో పారిశుధ్య కార్మికులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఉచిత భోజన సౌకర్యం కల్పించడం హర్షణీయమన్నారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ కరోనాపై ఫ్రంట్ లైన్ వారియర్స్గా పోరాడుతున్న పారిశుధ్య కార్మికులకు అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. లాక్డౌన్ కాలంలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికులకు ప్రతి నాలుగు డివిజన్లకు ఒక ఉచిత భోజన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 20 భోజన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.ప్రతి కేంద్రంతో 200 మందికి భోజన వసతి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉచిత భోజన కేంద్రాలను పారిశుధ్య కార్మికులతో పాటు ఆశ వర్కర్లు వినియోగించుకోవాలని మేయర్ సూచించారు. విలీన గ్రామాల్లో విధులకు హాజరయ్యే కార్మికులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ ఇన్చార్జి కమిషనర్ సత్యనారాయణ, డీఈ రవీందర్, గ్రేటర్ జేఏసీ చైర్మన్ గౌరీశంకర్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్రాజ్, టీఆర్ఎస్ నాయకులు దేవరకొండ సురేందర్, కొడకండ్ల సదాంత్, రమేశ్, శంకర్ పాల్గొన్నారు.