Maneka Gandhi | ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ (Pilibhit) సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi)కి బీజేపీ (BJP) టికెట్ నిరాకరించడంపై ఆయన తల్లి మేనకా గాంధీ మరోసారి స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని సుల్తాన్పూర్ (Sultanpur) నియోజకవర్గంలో పర్యటిస్తున్న మేనకా గాంధీని.. లోక్సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీ పోటీ విషయమై విలేకర్లు ప్రశ్నించారు.
దీనికి ఆమె స్పందిస్తూ.. వరుణ్ గాంధీ మంచి ఎంపీగా నిలిచాడని అన్నారు. వరుణ్ గాంధీ భవిష్యత్తులో దేశానికి మేలు చేస్తాడంటూ చెప్పుకొచ్చారు. ‘ఇది పార్టీ తీసుకున్న నిర్ణయం. వరుణ్ మంచి ఎంపీగా నిలిచాడు. భవిష్యత్తులో ఏం చేసినా దేశానికి మేలే చేస్తాడు’ అంటూ సమాధానమిచ్చారు.
ఉత్తరప్రదేశ్ పిలిభిత్ (Pilibhit) నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ్ గాంధీ గత కొంతకాలంగా పార్టీ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలపై పలు సందర్భాల్లో తన అసమ్మతి గళాన్ని వినిపిస్తూ వచ్చారు. కీలక అంశాల్లో పార్టీ నిర్ణయాలపైనే బహిరంగ విమర్శలు గుప్పించారు. కొంతకాలంగా తన లోక్సభ నియోజకవర్గమైన పిలిభిత్లో క్రియాశీలకంగా ఉంటున్న ఆయన.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్కు ప్రతికూలంగా మాట్లాడుతున్నారు.
దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారంటూ ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. ఈ క్రమంలో ఈసారి లోక్సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీకి కమలం పార్టీ టికెట్ ఇవ్వలేదు. పిలిభిత్ నియోజకవర్గం నుంచి వరుణ్ స్థానంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాదకు టికెట్ ఇచ్చింది. అయితే, ఆయన తల్లి మేనకా గాంధీకి మాత్రం మరోసారి అవకాశం కల్పించింది కమలం పార్టీ. యూపీలోని సుల్తాన్పూర్ నుంచి మరోసారి బరిలోకి దింపింది. పిలిభిత్ నుంచి వరుణ్ గాంధీ 2009, 2019లో విజయం సాధించారు. ఆయన వరుసగా రెండుసార్లు బీజేపీ నుంచే గెలుపొందిన విషయం తెలిసిందే.
Also Read..
Aishwarya Rajinikanth | విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న ఐశ్వర్య-ధనుష్ దంపతులు
liquor policy Case | మరో ఆప్ ఎమ్మెల్యేకు ఈడీ సమన్లు.. కేజ్రీ వ్యక్తిగత సహాయకుడి వాంగ్మూలం నమోదు