ముంబై : మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ-శివసేన (BJP-Shiv Sena) మధ్య సాన్నిహిత్యం మళ్లీ పెరగడం ప్రారంభమైంది. నిన్నటివరకు నీప్పు-ఉప్పులా ఉన్న ఈ రెండు పార్టీలు.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అన్న నానుడిని నిజం చేస్తున్నాయి. బీజేపీపై మాటల తూటాలు పేల్చిన సంజయ్ రౌత్.. ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఔరంగాబాద్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన సీఎం ఉద్ధవ్ ఠాక్రే, రైల్వే మంత్రి రావు సాహెబ్ దన్వేను చూడగానే.. ‘ఫ్యూచర్ కొలీగ్’ అని సంభోదించడం వారి మధ్య మళ్లీ చిగురించనున్న మైత్రికి దర్పణం. ముంబై-నాగ్పూర్ మధ్య బుల్లెట్ రైలు తీసుకువస్తే మీతోనే ఉంటానని ప్రమాణం చేస్తున్నానని ఉద్ధవ్ ఠాక్రే చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఇదే వేదికపై కేంద్ర మంత్రి రావుసాహెబ్ దన్వే స్పందిస్తూ, శివసేన-బీజేపీ కలిస్తే ఓటర్లు సంతోషంగా ఉంటారని అన్నారు. ఇరువురు నేతల ప్రకటనల తర్వాత.. రాష్ట్రంలో మళ్లీ రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.
మహారాష్ట్ర రాజకీయాల్లో దాదాపు 30 సంవత్సరాలు కలిసి ఉన్న శివసేన-బీజేపీ 2019 సంవత్సరంలో విడిపోయాయి. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్సీపీ, కాంగ్రెస్తో శివసేన జత కట్టి ఠాక్రే ముఖ్యమంత్రి కాగలిగారు. అప్పటినుంచి రెండు పార్టీల మధ్య అంతరం పెరిగిపోయింది. అయితే, ఇటీవలి కాలంలో వీరి మాట తీరులో మార్పుతో రానున్న కాలంలో రెండు పార్టీలు కలిసిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. సీఎం ఠాక్రే ప్రకటన తర్వాత మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి అబ్దుల్ సత్తార్ మరో కీలక ప్రకటన చేశారు. ఈ రెండు పార్టీలు కలిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెరుగైన సమన్వయం ఉంటుందని ఆయన చెప్పారు.
సమయం వచ్చిందంటే బీజేపీపై ఒంటికాలిపై లేచే ఎంపీ సంజయ్ రౌత్.. నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా మోదీని ఆకాశానికెత్తారు. భారతదేశంలో మోదీ స్థాయికి మించిన నాయకుడు మరొకరు లేరని, వాజపేయి తర్వాత బీజేపీని అగ్రస్థానానికి తీసుకువచ్చే పనిని విజయవంతంగా పూర్తిచేశారని కొనియాడారు. గతంలో బీజేపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది. కానీ ప్రధాని మోదీ కారణంగా బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చిందని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి ఠాక్రే ప్రకటనపై మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. ఇది శుభపరిణామమని, అయితే, తమ వైఖరి ఎప్పుడో బహిర్గతం చేశామన్నారు. మేం ఎప్పుడు కూడా అధికారం కోసం చూడలేదని, మేం సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని చెప్పారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని పేర్కొన్నారు.
ఉద్ధవ్ ఠాక్రే మనుసులో ఏముందో నేనెలా చెప్పగలనని ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. రాజకీయాల గురించి మేం ఏనాడూ మాట్లాడుకోలేదని, ప్రజా సమస్యలు, పరిష్కారాల గురించే చర్చిస్తామన్నారు.
మర్చిపోలేని ఉరి ఘటనకు ఐదేండ్లు
డబ్బానిండా 5 సెంట్ల కాయిన్లు.. ఎందుకిచ్చాడంటే?
14 ఏండ్ల క్రితం కిడ్నాప్.. ఫేస్బుక్ మెసేజ్తో కలిసిన తల్లీకూతురు
దగ్గితే చాలు.. వ్యాధేంటో ఈ యాప్ చెప్తుంది!
మనుషుల మాదిరిగా టాయిలెట్ వాడుతున్న ఆవులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..