సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో భాగంగా ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా ఇటీవల రవాణా శాఖ షోరూంల్లోనే వాహనాల రిజిస్ట్రేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రక్రియ సైతం ఆలస్యానికి ప్రతీకగా మారింది. 15 రోజులు గడిచినా ఆర్సీలు అందడం లేదని వాహనదారులు చెబుతున్నారు. అటు సంబంధిత ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లి ఆరా తీస్తే మీ వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లు మాకు అందలేదని అధికారులు చెబుతున్నారని వివరించారు.
ఇదే విషయం షోరూంల్లో ఆరా తీయగా తాము పంపించినట్టు చెబుతున్నారు. మధ్యలో వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు. ఇటీవల రవాణా శాఖ వాహనదారుడి డాక్యుమెంట్స్ అన్నీ ఆన్లైన్లోనే పంపించాలని ఆదేశాలు సైతం షోరూంలకు జారీ చేసింది. కానీ షోరూంల్లో ఆన్లైన్ ప్రక్రియపై తమకు ఎలాంటి ఆదేశాలు అందడం లేదని కొన్ని షోరూం నిర్వాహకులు చెప్పడం గమనార్హం.