Gaganyaan Mission | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (Isro) చైర్మన్ సోమనాథ్ (Somanath) కీలక ప్రకటన చేశారు. అంతరిక్షానికి మినిషిని పంపించే లక్ష్యంగా నిర్దేశించుకున్న మొట్టమొదటి మానవ సహిత మిషన్ ‘గగన్యాన్’ మిషన్ (Gaganyaan Mission)కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు. ముందుగా అనుకున్నట్లు 2025లో కాకుండా.. ఈ మిషన్ను 2026లో చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆల్ ఇండియా రేడియోలో సర్దార్ పటేల్ మెమోరియల్ లెక్చర్ (Sardar Patel Memorial Lecture) సందర్భంగా సోమనాథ్ ఈ కొత్త షెడ్యూల్ను వెల్లడించారు.
చంద్రయాన్-3, మిషన్ ఆదిత్య ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించి సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో ఆ ఊపుతో.. తొలిసారిగా మానవులను అంతరిక్షంలోకి పంపే గనన్యాన్ యాత్రను చేపట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి మూడు రోజుల పాటు పంపి, సురక్షితంగా వారిని భూమిపైకి తేవడమే ఈ మిషన్ లక్ష్యం. ఆగస్టులో చంద్రయాన్-3 విజయవంతం తర్వాత తదుపరి మిషన్ అయిన గగన్యాన్ కోసం సిబ్బంది రేయింబవళ్లు చేసిన కృషితో ఈ మిషన్ సిద్ధమవుతున్నట్లు ఇస్రో చీఫ్ ఇటీవలే వెల్లడించారు.
గగన్యాన్ మిషన్లో ఇస్రో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నది. ముగ్గురు వ్యోమగాములను దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తయిన కక్ష్యలోకి చేర్చి.. తిరిగి వారిని భూమిపైకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ప్రయోగం మూడు రోజులపాటు జరుగనున్నది. వ్యోమగాములు తిరుగు ప్రయాణంలో సముద్రంపై సురక్షితంగా దిగాల్సి ఉంటుంది. వాస్తవానికి 2022లోనే ప్రాజెక్టు చేపట్టాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయితా పడుతూ వచ్చింది. ఇస్రో చేపట్టిన ఈ మిషన్ విజయవంతమైతే అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించనున్నది.
మరోవైపు రానున్న సంవత్సరాల్లో భారత్ చేపట్టనున్న అంతరిక్ష యాత్రల వివరాలను కూడా సోమనాథ్ వెల్లడించారు. శాంపిల్ రిటర్న్ మిషన్ చంద్రయాన్-4 2028లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇక భారత్-అమెరికా సంయుక్తంగా చేపట్ట దలచిన నిసార్ (NISAR) మిషన్పై కూడా సోమనాథ్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ మిషన్ను వచ్చే ఏడాది అంటే 2025లోనే ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు.
జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జగ్జాతో (JAXA) చంద్రయాన్-5 మిషన్ ప్రయోగం చేపట్టనున్నామని, ఇది మూన్-ల్యాండింగ్ మిషన్ అని వివరించారు. ఈ మిషన్ అసలు పేరు లుపెక్స్ (LUPEX) లేదా ‘లునార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్’ అని చెప్పారు. అయితే ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపడతారన్న సమయాన్ని ఆయన వెల్లడించలేదు. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 2025లో ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టుని చంద్రయాన్-5గా సోమనాథ్ పేర్కొన్నారు కాబట్టి చంద్రయాన్-4 పూర్తయిన తర్వాత 2028లో చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read..
Delimitation | జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన.. అలా అయితే దక్షిణాదికి తీరని నష్టమే..!
C-295 Aircraft | సి-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కర్మాగారం ప్రారంభం
Terror Attack | ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు.. టెర్రరిస్ట్ హతం