Vande Bharat sleeper train | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్గాల్లో సెమీహైస్పీడ్ రైళ్లు పరుగులుపెడుతున్నాయి. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తుండడంతో సుదూర ప్రాంతాల ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని వందే భారత్లో స్లీపర్ (Vande Bharat sleeper train) వెర్షన్ను తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ స్థాయి అత్యాధునిక సౌకర్యాలతో స్లీపర్ రైళ్లను తీసుకువస్తున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల మధ్య ఈ రైలు ట్రయల్స్ నిర్వహించింది.
ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. ఈనెల చివరి నాటికి దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించారు. దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును బీహార్ నుంచి ప్రారంభించనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. త్వరలో బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ఢిల్లీ-పాట్నా మధ్య ప్రారంభించే అవకాశం ఉందని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
గంటకు 160 కిలోమీటర్ల వేగంతో..
ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దాంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనున్నది. వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్లుంటాయి. ఇందులో 11 థర్డ్ ఏసీ టైర్ కోచ్లుంటాయి. నాలుగు సెకండ్ ఏసీ టైర్ కోచ్లు, ఒకటి ఫస్ట్ ఏసీ కోచ్ ఉంటుంది. ఫస్ట్ ఏసీ కోచ్లో 24 బెర్తుంటాయి. ఇక సెకండ్ ఏసీ కోచ్లో 48 సీట్లు ఉంటాయి. థర్డ్ ఏసీ కోచ్లోని ఐదింటిలో 67 బెర్తులు, మరో నాలుగింట్లో 55 బెర్తుల చొప్పున ఉంటాయి. రైలు సహాయక సిబ్బంది కోసం సైతం 38 ప్రత్యేక బెర్తులంటాయి. దృష్టిలోపం ఉన్న ప్రయాణికులకు సహాయం అందించేందుకు బ్రెయిలీ నావిగేషన్ సైతం అమర్చారు. వందే భారత్ స్లీపర్ రైలులో ఒకేసారి 823 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది.
రైలు ప్రత్యేకతలు..
వందే భారత్ స్లీపర్ రైలుకు చాలానే ప్రత్యేకలున్నాయి. విమానం తరహాలో ప్రయాణికులు ఈ రైలులో సౌకర్యాలుంటాయి. ఈ రైలు ముందు విలాసవంతమైన హోటల్స్ సైతం దిగదుడుపేనని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. రైలులో ఫైర్ సేఫ్టీతో పాటు ప్రతి బెర్త్ వద్ద అత్యవసర స్టాప్ బటన్స్ సైతం ఉంటాయి. ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు బెర్తులను మెరుగైన కుషన్తో ఏర్పాటు చేశారు. అప్పర్ బెర్తులు ఎక్కేలా మెట్లు ఏర్పాటు చేశారు.
ఈ రైళ్లు ప్రయాణికులకు సరికొత్త అనుభవాన్ని అందించనున్నాయి. బయో వాక్యూమ్ టాయిలెట్లు, టచ్ ఫ్రీ ఫిట్టింగ్లు, షవర్ క్యూబికల్స్, ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ ఆధారిత డిస్ప్లేలు, ఛార్జింగ్ సాకెట్లు తదితర అధునాతన ఫీచర్స్ను సైతం రైల్వేశాఖ జోడించింది. రైలులో ఆటోమేటెడ్ డోర్లు ఏర్పాటు చేశారు. టాయిలెట్లో ఎలాంటి బయటన్ నొక్కకుండానే నీళ్లు వస్తాయి. ఒక కోచ్ నుంచి మరో కోచ్లోకి వెళ్లేందుకు ఆటో మేటిక్ డోర్లు ఏర్పాటు చేశారు. ప్రతి కోచ్లో ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ సైతం ఉంటుంది.
ప్రతి కోచ్లో సీసీ కెమెరాలు..
ప్రతి కోచ్లోనూ సీసీ కెమెరాలు ఉంటాయి. చార్జింగ్ పెట్టుకునేందుకు ప్రతి బెర్త్ వద్ద సాకెట్ ఉంటుంది. అలాగే, బెర్త్ వద్ద చిన్న లైట్ సైతం ఉంటుంది. దాంతో ఎవరైనా బుక్లు, పేపర్ చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. సేఫ్టీ ‘కవచ్’ సిస్టమ్, బ్లాట్ ప్రూఫ్ బ్యాటరీ, 3 గంటల ఎమర్జెన్సీ బ్యాకప్ ప్రయాణీకుల భద్రతను నిర్ధారిస్తాయని రైల్వేశాఖ పేర్కొంది.
Also Read..
Terror Threat | కోటి మంది లక్ష్యంగా.. దేశంలో భారీ ఉగ్రకుట్రకు ప్లాన్.. పోలీసులు హై అలర్ట్
Tesla | భారత్లో తొలి కారును డెలివరీ చేసిన టెస్లా.. ఇంతకీ ఎవరు కొన్నారంటే..?
Onam | కేరళలో ఘనంగా ఓనం వేడుకలు.. ప్రత్యేకతలు ఇవే..