న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. బుదవారం 27 వేలకుపైగా నమోదైన పాజిటివ్ కేసులు తాజాగా 32 వేల చేరువలో నిలిచాయి. కొత్తగా కరోనా బారినపడిన వారిలో 19 వేల మంది ఒక్క కేరళలోనే ఉన్నారు.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 31,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 282 మంది బాధితులు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,63,421కి చేరగా, మరణాలు 4,46,050కి పెరిగాయి. మరో 3,28,15,731 మంది కరోనా నుంచి కోలుకోగా, 3,01,604 కేసులు ఇంకా యాక్టివ్గా ఉన్నాయి. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 184 రోజుల దిగువకు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కొత్తగా 31,990 మంది వైరస్ నుంచి బయటపడ్డారని తెలిపింది.
కాగా, దేశవ్యాప్తంగా కరోనా టీకాల పంపిణీ ముమ్మరంగా కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 71,38,205 మందికి వ్యాక్సినేషన్ చేశామని పేర్కొన్నది. దీంతో మొత్తంగా 83,39,90,049 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.