బచ్చన్నపేట/లింగాలఘనపురం, ఏప్రిల్ 21 : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో బుధవారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. ఇటిక్యాలపల్లి, రామచంద్రాపూర్ తదితర గ్రామాల్లో వర్షం పడడంతో వరితో పాటు మామిడి కాయలు నేలరాలాయి. పంట నష్టంపై అంచనా వేసి రైతులకు పరిహారం అందించాలని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చెంద్రారెడ్డి కోరారు. అలాగే లింగాలఘనపునం మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం రాత్రి చిరుజల్లులు పడ్డాయి. బండ్లగూడెం, లింగాలఘనపురం, నెల్లుట్ల, పటేలుగూడెం తదిర గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడి వాన కురిసింది.
పిడుగు పడి గీత కార్మికుడు మృతి
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం, బోరునర్సాపురం, మల్లూరు తదితర గ్రామాల పరిధిలో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురిసింది. వర్షం కొంచెం తక్కువగా ఉన్న సమయంలో మల్లూరు సమీపంలో గండి వెంకన్న(55) అనే గీత కార్మికుడు తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా పిడుగుపడింది. దీంతో వెంకన్న చెట్టు మీద నుంచి కిందికి జారిపడ్డాడు. అపస్మారక స్థితికి వెళ్లిన అతన్ని వైద్యం కోసం వరంగల్ తరలిస్తుండగా, మార్గమధ్యలోనే మృతిచెందాడు.