PM Modi | డీప్ఫేక్ వీడియోలు, ఫొటోలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మరోసారి స్పందించారు. కొత్త టెక్నాలజీతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్’ (Smart India Hackathon) ముగింపు సందర్భంగా విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. ఈ సందర్భంగా కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మోదీ నొక్కి చెప్పారు.
‘కొత్త సాంకేతికతతో మనం జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగిస్తే అవి మానవాళికి అంత ఉపయోగకరంగా ఉంటాయి. కానీ, ఆ సాంకేతికతను దుర్వినియోగం చేస్తే.. అతి పెద్ద సమస్యలను సృష్టించగలదు. కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన వీడియోలు, చిత్రాలు నిజమైనవిగా కనిపిస్తాయి. అలాంటి వాటిని నిజమని నమ్మేందుకు ముందు వాటి ప్రామాణికతను సరిచూసుకోవాలి’ అని ప్రధాని మోదీ అన్నారు.
కాగా, డీప్ఫేక్ వీడియోస్ (Deepfake Videos).. ఈ పదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. అందుకు కారణం పలువురు సినీ తారల మార్ఫింగ్ వీడియోలు వైరల్ కావడమే. ప్రముఖ సినీ తారలు రష్మిక మందన్నా (Rashmika Mandanna), కత్రినా కైఫ్, కాజోల్, అలియా భట్ సహా పలువురు స్టార్ తారల ఫేక్ వీడియోలు ఇటీవలే తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సినీఇండస్ట్రీని తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీప్ఫేక్ వీడియోలపై ప్రధాని మోదీ గతంలోనూ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. డీప్ఫేక్ వీడియోలు, ఫొటోలను సృష్టించడానికి కృత్రిమ మేధ (artificial intelligence) ను ఉపయోగించడం సమస్యాత్మకమని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాను కోరారు. ఇలాంటి వీడియోలు మన వ్యవస్థకు పెను ముప్పుగా మారుతున్నాయన్నారు.
Also Read..
Rashmika Mandanna | రష్మిక డీప్ఫేక్ కేసు.. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
Coronavirus | కొవిడ్ కొత్త వేరియంట్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన
Sonia Gandhi | ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తున్నారు.. ఎంపీల సస్పెన్షన్పై సోనియా గాంధీ