దేవరకద్ర రూరల్, జూన్ 7: కరోనాతో మృతి చెంది న మహిళకు అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు, స్థానికులు ముందుకు రాకపోవడంతో సహాయ ఫౌండేషన్ సహకారంతో కార్యక్రమం నిర్వహించిన సంఘటన చింతకుంట మండలంలో చోటుచేసుకుంది. చిన్న చింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామానికి చెందిన జయమ్మ అనే మహిళ కరోనాతో సోమవారం మృతి చెందింది. స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు పార్థివ దేహాన్ని గ్రామానికి తీసుకురాగా, బంధువులు, గ్రామస్తులు ఎవరూ ముందుకు రాలేదు. అదేగ్రామానికి చెందిన ఉద్యమకారుడు బాలరాజు సహాయ ఫౌండేషన్ సభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో సంస్థ సభ్యులు గ్రామానికి చేరుకుని హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం సంస్థ ఫౌండర్ టంకరి శివప్రసాద్ మాట్లాడుతూ కరోనా వైరస్ సోకి మృతిచెందిన వ్యక్తి ద్వారా ఇంకొకరికి వైరస్ సోకదని, ఈ విషయం తెలియక చాలామంది అంత్యక్రియల్లో సైతం పాల్గొనడానికి భయపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో కిశోర్గౌడ్, విజయ్రెడ్డి, రాజేశ్, శివకుమార్, మనోజ్గౌడ్, వెంకట్ పాల్గొన్నారు.