డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు క్షేమంగానే ఉన్నారు. టన్నెల్ లోపల ఉన్నవారి క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలిస్తున్నాయి. గత 11 రోజులుగా సొరంగంలో ఉన్న బాధితుల వద్దకు ఆరు అంగుళాల పైపుద్వారా పంపిన ఓ ఎండోస్కోపీ కెమెరాలో కూలీలకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ దృశ్యాలను బట్టి వారంతా సురక్షితంగానే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
సొరంగంలో చిక్కుకున్న బాధితులతో వారి కుటుంబసభ్యులను వీడియో ద్వారా మాట్లాడించారు. బాధితుల్లో ధైర్యం నింపే ఉద్దేశంతో అధికారులు ఈ ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించిన వీడియోలను మీడియాకు అందజేశారు. కాగా, బాధితులకు కావాల్సిన ఆహారం, మంచినీళ్లను అధికారులు ఎప్పటికప్పుడు సరఫరా చేస్తున్నారు. బాధితులను బయటికి తీసుకొచ్చేందుకు రక్షణ చర్యలను మరింత ముమ్మరం చేశారు.
కాగా, సొరంగం ఉన్న కొండ పై భాగం నుంచి నిలువుగా తవ్వి, వెడల్పుగా ఉండే గొట్టాన్ని పంపించడం ద్వారా కూలీలను బయటకు తీసుకురావాలనే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడింది. సొరంగపైన డ్రిల్ చేస్తుండగా మధ్యలో గట్టిరాయి తగిలింది. దాంతో సొరంగం పై నుంచి డ్రిల్ వేయడానికి బదులుగా.. సొరంగంలో కూలిన శిథిలాలకు ఒక చివరి నుంచి మరో చివరికి 60 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేసేందుకు ‘జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ’ ప్రయత్నిస్తున్నది.
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Family members of the workers trapped in the Silkyara tunnel interact with them through the pipeline inserted inside the tunnel.
(Video Source: Family member of the trapped worker) pic.twitter.com/nKoEQGiIfT
— ANI (@ANI) November 21, 2023