PM Modi | హైదరాబాద్, మే 4 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): గృహరుణమో, కారు రుణమో.. ఒక్కనెల ఈఎంఐ కట్టకుండా ఆపండి.. బ్యాంకు నుంచి వందలాది ఫోన్లు వస్తాయి. రెండో నెల కూడా ఈఎంఐ జమచేయకపోతే ఇంటికి ఏకంగా నోటీసులు, జప్తు చేస్తామంటూ బెదిరింపులు వస్తాయి. అవునా? సామాన్యుల విషయంలో ఈ రేంజులో విరుచుకుపడే బ్యాంకులు.. కార్పొరేట్ల విషయంలో మాత్రం సైలెంట్గా ఉంటున్నాయి. పేద, మధ్యతరగతి జీవులు పైసాపైసా కూడబెట్టి బ్యాంకుల్లో దాచుకొన్న సొమ్ము.. ఎగవేతదార్ల జేబుల్లోకి పోతున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశీయ బ్యాంకింగ్ రంగంలో రుణాల రైటాఫ్లు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగాయి. 2014 నుంచి 2023 నాటికి ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.14,56,226 కోట్ల మొండి బకాయిలు రద్దు చేశాయి. ఇందులో కార్పొరేట్లకు సంబంధించి రూ. 7,40,968 కోట్లు ఉండటం గమనార్హం.
ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలు (విల్ఫుల్ డిఫాల్ట్లు) బీజేపీ హయాంలో ఏకంగా పది రెట్లు పెరిగాయి. 2022 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల సంఖ్య 16,044గా ఉన్నట్టు పలు బ్యాంకులు ఇచ్చిన నివేదికలను బట్టి తెలుస్తున్నది. మొత్తంగా వీళ్లు రూ. 3,46,479 కోట్ల రుణాలను కావాలనే ఎగ్గొట్టినట్టు సమాచారం. ఇందులో 85 శాతం రుణాలను ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచే తీసుకొన్నట్టు తెలుస్తున్నది.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలను తీసుకొని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులు విల్ఫుల్ డిఫాల్టర్లేనని సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వేసిన ఓ పిటిషన్కు ప్రభుత్వమే బదులిచ్చింది. ఇచ్చిన రుణాలను తర్వాత వసూలు చేసుకుంటామంటూ ముందుగా రైటాఫ్లకు దిగుతున్న బ్యాంకులు.. ఆ తర్వాత రికవరీ చేస్తున్న మొత్తాలు అత్యంత తక్కువగా ఉంటున్నాయి. గడిచిన తొమ్మిదేండ్లలో రూ.14,56,226 కోట్ల మొండి బకాయిలను రైటాఫ్ చేసిన బ్యాంకులు.. వసూలు చేసింది మాత్రం రూ. 2,04,668 కోట్లే. అంటే రికవరీ రేటు కేవలం 14 శాతమే.