న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కాల్పులు కలకలం సృష్టించాయి. గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉత్తర ఢిల్లీలోని బారా హిందూరావ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ముజీబ్ అనే ప్రాపర్టీ డీలర్ ఈద్గా ప్రాంతంలో నివస్తుంటాడు. అతని మేనమామకు రాణి ఝాన్సీ రోడ్డులోని ఫిలిమిస్తాన్లో క్లినిక్ ఉన్నది. గురువారం రాత్రి వారు క్లినిక్ బంద్ చేసి ఇంటికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈక్రమంలో ఇద్దరు కారులో కూర్చోగానే.. ఓ యువకుడు వచ్చి వారి కారుకు అడ్డంగా నిల్చున్నాడు. అనంతరం మరో వ్యక్తి కూడా వచ్చాడు. జరగబోయే ప్రమాదాన్ని గుర్తించిన మామా అల్లుళ్లు కారులో నుంచి దిగి పరుగెత్తారు.
దీంతో దుండగులు వారిపై కాల్పులు జరిపారని, అయితే అటుగా వెళ్తున్న వారికి ఆ బుల్లెట్లు తగలడంతో ఇద్దరు మరణించారని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరిని గుర్తించామని, మరొకరు ఎవరనే విషయం ఇంకా తెలియలేదని వెల్లడించారు. కాగా, ఐదు నుంచి ఆరుగురు ఈ కాల్పులకు తెగబడ్డారని, వారికోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.