Union Minister : కేంద్ర మంత్రి, బీజేపీ నేత రవ్నీత్ సింగ్ బిట్టూపై బెంగళూర్లోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేంద్ర మంత్రిపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కేసు నమోదైంది. కాగా, కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ చేసిన వ్యాఖ్యలపై అంతకుముందు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భగ్గుమన్నారు.
ఢిల్లీలోని కేంద్ర మంత్రి నివాసం, కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మంత్రి ఇంటి ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. రాహుల్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాషాయ నేతలు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కాగా, రాహుల్ గాంధీ భారతీయడు కాదని, ఆయన తన జీవితకాలంలో అధిక సమయం విదేశాల్లోనే గడుపుతారని కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూ అన్నారు.
విదేశీ పర్యటనల్లో భారత్ గురించి తప్పుగా మాట్లాడతారని, ఆయనకు దేశం పట్ల ప్రేమ లేదని దుయ్యబట్టారు. వేర్పాటువాదులు, బాంబులు, తుపాకీలు తయారుచేసేవారు, మోస్ట్ వాంటెడ్ పీపుల్ వంటి మారు మాత్రమే రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రశంసిస్తారని ఎద్దేవా చేశారు. విమానాలు, రైళ్లు, రహదారులను తగులబెట్టే దేశ శత్రువులే రాహుల్ను సమర్దిస్తారని వ్యాఖ్యానించారు. దేశానికి అతిపెద్ద శత్రువు, నెంబర్ వన్ టెర్రరిస్ట్ను ఎవరినైనా పట్టుకోవాలంటే అది రాహుల్ గాంధీ మాత్రమేనని మండిపడ్డారు.
Read More :
Gandhi Hospital | పాలకుల పర్యవేక్షణా లోపం, అధికారుల నిర్లక్ష్యం.. గాంధీలో మరణ మృదంగం