నల్లగొండ ప్రతినిధి, మార్చి30 (నమస్తే తెలంగాణ) :నాగార్జునసాగర్లో అంతంతమాత్రంగా ఉన్న బీజేపీలో అభ్యర్థి ఎంపిక మరింత ముసలానికి కారణమైంది. ఆ పార్టీలో అప్పటికే ఉన్న నేతలతోపాటు ఎన్నికల ముందు పలువురిని చేర్చుకుని టికెట్ల ఆశచూపడం నేతల మధ్య అగాధానికి దారి తీసినట్లయింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి సతీమణి నివేదితారెడ్డి మరోసారి టికెట్టు ఆశిస్తూ ప్రచారాన్ని కూడా మొదలుపెట్టింది. వీరితో పాటు టీడీపీ నుంచి కడారి అంజయ్యయాదవ్ కూడా బీజేపీలో చేరి టికెట్ ఆశించారు. తీరా ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి రిక్కల ఇంద్రసేనారెడ్డిని, డాక్టర్ రవినాయక్ను కూడా పార్టీలో చేర్చుకుని టికెట్టు ఆశపెట్టారు. నివేదితకు గానీ, అంజయ్యయాదవ్కు గానీ టికెట్ ఇస్తారని ఊహించారు.
కానీ, చివరి నిమిషంలో అనూహ్యంగా రవినాయక్కు ఇవ్వడంతో మిగతా నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీతో గానీ, నేతలతో గానీ తన భవిష్యత్తుకు మరింత ప్రమాదకరమని భావించిన కడారి అంజయ్యయాదవ్ మంగళవారం టీఆర్ఎస్లో చేరాలని భావిస్తూ సంకేతాలు పంపించారు. మంత్రి జగదీశ్రెడ్డి చొరవ తీసుకోవడంతో ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, శానంపూడి సైదిరెడ్డి కడారి అంజయ్యయాదవ్, ఆయన అనుచరులను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడే వీరి భవిష్యత్తు గురించి కేసీఆర్ చర్చించి భరోసా ఇవ్వడంతో కడారి అంజయ్యయాదవ్ కేసీఆర్ చేతుల మీదుగా గులాబీ కండువా కప్పుకున్నారు.
మరోవైపు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి దంపతులు అలిగి నామినేషన్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇప్పటికే వేసిన ఒక సెట్ నామినేషన్ను దాఖలు చేసిన నివేదితారెడ్డి ఉపసంహరించుకుంటారా? లేదా? అన్నది ఆ పార్టీలో ఆసక్తికరంగా మారింది.
ఇవీ కూడా చదవండి..
అభయమిస్తూ.. ఆర్థిక భరోసా కల్పిస్తూ…
బై బై తెలంగాణ.. మళ్లీ వస్తాం..