హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా మారిన ఔటర్ రింగ్ రోడ్డుకు ఆధునిక హంగులు అద్దుతున్నారు. 158 కి.మీ ఔటర్ రింగ్ రోడ్డును మరింత ఆధునీకరించాలన్న సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు బ్యూటిఫికేషన్ పనులు చేపడుతున్నారు. ఓఆర్ఆర్పై రద్దీ పెరిగిన నేపథ్యంలో వాహనదారులను ఆకట్టుకునేలా పచ్చదనం, అపురూప శిల్పాలు, పెయింటింగ్స్, రాక్లైటింగ్స్ వంటి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఔరా అనిపించేలా..
ప్రస్తుతం ఓఆర్ఆర్ చుట్టూ 19 ఇంటర్చేంజ్ల వద్ద ఉన్న విశాలమైన ఖాళీ స్థలాల్లో పచ్చని మొక్కలతో సుందరీకరణ పనులు చేపడుతున్నారు. ముఖ్యంగా గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు రాత్రివేళల్లో మిరుమిట్లు గొలిపేలా ప్రత్యేకంగా బౌల్డర్స్ లైటింగ్స్ పనులు చేపట్టారు. ఇప్పటికే ఈ మార్గంలో సెంట్రల్ మీడియన్లో 24 కి.మీ పొడవునా వీధి దీపాలను ఏర్పాటు చేశారు. ఇలా ఓఆర్ఆర్ పొడవునా ఒక్కో ప్రాంతాన్ని ఒక్కోలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) వెచ్చిస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ సంస్థ ప్రత్యేకంగా ఔటర్ రింగ్ రోడ్డు అభివృద్ధి కోసమే పనిచేస్తోంది. ముఖ్యంగా ఓఆర్ఆర్ అంటే ఔరా అనిపించేలా చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
శిల్పాలతో మరింత అందం..
ఔటర్ రింగ్ రోడ్డు సుందరీకరణ పనుల్లో భాగంగా రకరకాల ఆకృతుల్లో శిల్పాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 65 లక్షలను వెచ్చించారు. నార్సింగి, గచ్చిబౌలి, నానక్రాంగూడ ప్రాంతంలో కాకతీయ తోరణం, రెండు అరచేతులతో కూడిన శిల్పాలను ఏర్పాటు చేశారు. రింగ్ రోడ్డుగుండా వెళుతున్న వారిని ఆకట్టుకోవడమే కాకుండా ఓఆర్ఆర్కు మరింత అందాన్ని తీసుకువస్తున్నాయి.
ఇంటర్చేంజ్ల వద్ద ల్యాండ్ స్కేపింగ్…
హైదరాబాద్ చుట్టూ ఉన్న 158 కి.మీ పొడవైన ఔటర్ రింగ్ రోడ్డుపై 19 చోట్ల ప్రధానంగా ఇంటర్చేంజ్లు ఉన్నాయి. పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్జీసీఎల్) శంషాబాద్ ఇంటర్చేంజ్, నార్సింగ్ జంక్షన్ వద్ద 25లక్షలతో ల్యాండ్ స్కేపింగ్ను చేపట్టారు. అత్యంత రద్దీ గల ఈ రెండు ప్రాంతాలు వాహనదారులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో ఇతర ఇంటర్చేంజ్ల వద్ద 7.87 కోట్లతో పనులు చేపట్టగా మే చివరి నాటికి పూర్తి కానున్నాయి.
రాక్ లైటింగ్…
ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ సమయంలో గుట్టలను చీల్చుకుంటూ రోడ్లు వేశారు. దీంతో ఇరువైపులా భారీ ఎత్తులో రాళ్లతో కూడిన గుట్టలు అక్కడక్కడ ఉన్నాయి. ఇవి ప్రధానంగా గచ్చిబౌలి నుంచి శంషాబాద్ మధ్య ఓఆర్ఆర్పై ఉండగా, ఇక్కడ 2కోట్ల వ్యయంతో 4.5 కి.మీ మేర రాక్లైటింగ్ను ఏర్పాటు చేశారు. రాత్రివేళల్లో ఈ ప్రాంతంగుండా ప్రయాణించే వారి మనసును దోచుకుంటున్నది. ఇతర ప్రాంతాల్లో ఉన్న రాళ్ల గుట్ట వద్ద మరో కోటి రూపాయలతో 3 కి.మీ పొడువున పనులు చేపట్టారు.
ల్యాండ్ స్కేపింగ్ ఐస్ల్యాండ్స్..
ఇంటర్చేంజ్ల వద్ద పైకి ఎక్కే, దిగే రహదారులకు పోను మిగిలిన ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. ఖాళీగా ఉన్న స్థలంలో పచ్చని గడ్డిని ఏర్పాటు చేసి నిరంతరం పచ్చగా ఉండేలా ల్యాండ్ స్కేపింగ్ను ఏర్పాటు చేశారు. మొదటి దశ పైలెట్ ప్రాజెక్టు కింద నార్సింగి జంక్షన్ వద్ద 19 కోట్లతో పనులు నిర్వహించారు. పటాన్చెరువు, మేడ్చల్ కండ్లకోయ, దుండిగల్ ఇంటర్చేంజ్ల ల్యాండ్ స్కేపింగ్ కోసం మరో 35లక్షలు వెచ్చించి పనులు నిర్వహిస్తున్నారు. మే చివరి నాటికి ఈ పనులు పూర్తి కానున్నాయి.
ఆకట్టుకునే పెయింటింగ్స్…
ఓఆర్ఆర్పై వాహనాల రాకపోకలకు ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా ఉండేందుకు చాలా చోట్ల వెహికల్ అండర్ పాస్ను నిర్మించారు. ఈ అండర్పాస్లను రంగు రంగుల పెయింటింగ్స్తో అద్భుతంగా తీర్చిదిద్దారు. నగర పౌరుల్లో సామాజిక సృహను కల్పించే థీమ్స్లో వీటిని ప్రముఖ ఆర్టిస్టులతో వేయించారు. ఫేజ్-1లో భాగంగా 11 చోట్ల 56లక్షలతో పెయింటింగ్స్ వేశారు. రెండో ఫేజ్లో 13 ప్రాంతాలను గుర్తించి మరో 75 లక్షలతో ప్రారంభించిన పెయింటింగ్ పనులు జూలై మొదటి వారం వరకు పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు.
గ్యాంట్రీ సైనేజెస్…
ఓఆర్ఆర్పై ఏర్పాటు చేసిన గ్యాంట్రీ సైనేజెస్(బోర్డు)లను మరింత ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం 75 లక్షలు వెచ్చించి గచ్చిబౌలి-శంషాబాద్ మార్గంలో 10 చోట్ల గ్యాంటీ సైనేజెస్లను ఏర్పాటు చేస్తున్నారు.
ఓఆర్ఆర్ పొడవునా ఒయాసిస్…
ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక్కో ప్రాంతంలో ఒక కి.మీ దూరాన్ని ఒయాసిస్గా మార్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ల్యాండ్స్కేపింగ్ ఆర్కిటెక్ట్స్, ఎన్విరాన్మెంటల్ డిజైనర్లతో రకరకాల ఒయాసిస్లను రూపొందించారు. మార్చి మొదటి వారం నుంచి ఈ పనులు ప్రారంభం కాగా, మే నెలాఖరు వరకు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా నార్సింగి ట్రంపెట్కు 42 లక్షలను కేటాయించారు.
రూ.కోటి రూపాయలతో ప్లాంటేషన్..
ఓఆర్ఆర్పై కోటి రూపాయలతో కొత్తగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మొదట శామీర్పేట, కండ్లకోయ ఇంటర్చేంజ్ల మధ్య 4 వరుసల్లో మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు. దీనికి సంబంధించి పనులు పూర్తయ్యాయి.
ల్యాండ్ స్కేపింగ్ వద్ద లైటింగ్..
ఓఆర్ఆర్పై అక్కడక్కడ ఏర్పాటు చేసిన ల్యాండ్ స్కేపింగ్ వద్ద 30లక్షలతో రంగు రంగుల విద్యుద్దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి కానున్నాయి. ఇంటర్చేంజ్ డిజైన్ స్పెసిఫిక్ లైటింగ్లను ఏర్పాటు చేసేందుకు 99లక్షలను ప్రతిపాదించగా, త్వరలోనే పనులు ప్రారంభించి జూన్ నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని పెట్టుకున్నారు.