న్యూఢిల్లీ: క్రిమినల్ డిఫమేషన్ కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడటంతో రాహుల్గాంధీ (Rahul Gandhi) లోక్సభ నుంచి సస్పెండ్ అయ్యారు. దాంతో గతంలో ఇలాగే జైలుశిక్ష పడటంతో పదవులు కోల్పోయిన ఎంపీలు, ఎమ్మెల్యేల జాబితాలో ఆయన చేరిపోయారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలుశిక్ష పడిన ప్రజాప్రతినిధులు తమ సభ్యత్వాన్ని కోల్పోతారు (Disqualification). ఆ తర్వాత కూడా ఆరేళ్ల వరకు వారు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి అర్హులు కారు. కాగా, రాహుల్గాంధీ కంటే ముందు క్రిమినల్ కేసులో జైలుశిక్షపడి పదవులు కోల్పోయిన ప్రజాప్రతినిధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
లాలూ ప్రసాద్ యాదవ్
సెప్టెంబరు 2013లో దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలడంతో RJD అధినేత లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటుపడింది. అప్పుడు ఆయన బీహార్లోని సరన్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
జయలలిత
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడిన తర్వాత ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) అధినేత్రి జే జయలలిత శాసనసభ్యత్వం రద్దయ్యింది. 2014 సెప్టెంబర్లో తమిళనాడు అసెంబ్లీ ఆమెపై అనర్హత వేటు వేసింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది.
మహ్మద్ ఫైజల్
హత్యాయత్నం కేసులో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత, లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్కు 2023 జనవరిలో పదేళ్ల జైలుశిక్ష పడింది. దాంతో ఆయన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అయితే, కేరళ హైకోర్టు అతని శిక్షను నిలిపివేసింది. ఈ క్రమంలో అతని అనర్హతను రద్దుచేస్తూ లోక్సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది.
ఆజం ఖాన్
2019 నాటి ద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్కు కోర్టు 2022 అక్టోబర్లో మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సభ్యత్వానికి ఆయన అనర్హులయ్యారు. ఆయన రాంపూర్ సదర్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.
అనిల్ కుమార్ సాహ్ని
మోసం కేసులో మూడేళ్ల జైలుశిక్ష పడటంతో RJD ఎమ్మెల్యే అనిల్ కుమార్ సాహ్ని 2022 అక్టోబర్లో బీహార్ అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హులయ్యారు. ఆయన కుర్హానీ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. 2012లో ప్రయాణాలు చేయకుండానే నకిలీ ఎయిర్ ఇండియా ఇ-టికెట్లను సృష్టించి ప్రయాణ భత్యం పొందేందుకు ప్రయత్నించిన కేసులో అతను దోషిగా తేలాడు.
విక్రమ్ సింగ్ సైనీ
2013 నాటి ముజఫర్నగర్ అల్లర్ల కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడిన బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీ.. 2022 అక్టోబర్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో తన శాసనసభ్యత్వం కోల్పోయారు. సైనీ ముజఫర్నగర్లోని ఖతౌలీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
ప్రదీప్ చౌదరి
కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ చౌదరికి ఓ దాడి కేసులో మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత జనవరి 2021లో హర్యానా అసెంబ్లీలో ఆయనపై అనర్హత వేటుపడింది. ఆయన కల్కా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
కుల్దీప్ సింగ్ సెంగార్
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తర్వాత 2020 ఫిబ్రవరిలో కుల్దీప్ సింగ్ సెంగార్పై ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ అనర్హత వేటు వేసింది. ఉన్నావ్లోని బంగార్మౌ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సెంగార్ను అంతకుముందు బీజేపీ బహిష్కరించింది.
అబ్దుల్లా ఆజం ఖాన్
సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబ్దుల్లా ఆజం ఖాన్కు 15 ఏళ్ల నాటి కేసులో 2023 ఫిబ్రవరిలో కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఆయనపై అనర్హత వేటువేసింది. ఆయన రాంపూర్ జిల్లాలోని సువార్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు.
అనంత్ సింగ్
RJD ఎమ్మెల్యే అనంత్ సింగ్ తన నివాసంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి దాచి ఉంచిన కేసులో దోషిగా తేలాడు. దాంతో 2022 జూలైలో బీహార్ అసెంబ్లీ అతనిపై అనర్హత వేటువేసింది. అనంత్ సింగ్ పాట్నా జిల్లాలోని మొకామా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి..