Today History : అయోధ్యలోని వివాదాస్పద కట్టడం అయిన బాబ్రీ మసీదును 1992 లో సరిగ్గా ఇదే రోజున కరసేవకులు కూల్చివేశారు. అనంతరం దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లలో దాదాపు 2 వేల మంది చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అయోధ్య పోలీసులు.. ఎల్కే అద్వానీ, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్తోపాటు మరో 44 మందిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కాగా, 2020 లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అయోధ్యలో ప్రస్తుతం రామ మందిరం నిర్మాణం పనులు జోరుగా సాగుతున్నాయి. అయోధ్యలో బాబ్రీ మసీదుగా చెప్పుకునే వివాదాస్పద కట్టడం కూల్చివేతలో దాదాపు లక్షన్నర మందికి పైగా కరసేవకులు పాల్గొన్నట్లుగా విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) నాయకులు చెప్తుంటారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని, బాబ్రీ మసీదును తొలగించాలని అప్పట్లో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ ప్రారంభించిన ఉద్యమం కారణంగానే.. ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగిందని చెప్పవచ్చు.
అయోధ్యలోని బాబ్రీ మసీదుపై కొన్నేండ్లుగా వివాదం నడుస్తున్నది. ఎల్కే అద్వానీ 1990లో రామ మందిర నిర్మాణం కోసం ఉద్యమాన్ని ప్రారంభించారు. 1992 డిసెంబర్ 5 వ తేదీన ఉదయం నుంచి కరసేవకులు అయోధ్యలోని వివాదాస్పద కట్టడం దగ్గరకు చేరుకోవడం ప్రారంభించారు. ఆ సమయంలో వివాదాస్పద నిర్మాణం ముందు భజనలు, కీర్తనలు ఆలపించేందుకు మాత్రమే సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే, మరుసటి రోజు ఉదయం అక్కడ గుమిగూడిన కరసేవకులు ఒక్కసారిగా వివాదాస్పద నిర్మాణంపైకి ఎక్కి దాన్ని కూల్చివేశారు. ఈ ఘటన అనంతరం దేశవ్యాప్తంగా మతపరమైన అల్లర్లు చెలరేగాయి. దాదాపు 2 వేల మందికి పైగా చనిపోయారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి 49 మందిని నిందితులుగా చేర్చారు. నిందితుల్లో ఎల్కే అద్వానీ, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, చంపత్ రాయ్, కమలేష్ త్రిపాఠి వంటి బీజేపీ, వీహెచ్పీ నేతలు ఉన్నారు. 28 సంవత్సరాల పాటు కోర్టులో విచారణ కొనసాగింది. 2021 సెప్టెంబర్ 30 న లక్నోలోని సీబీఐ కోర్టు సాక్ష్యాధారాలు లేని కారణంగా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. తీర్పు వెలువడే సమయానికి 49 మంది నిందితుల్లో 32 మంది మాత్రమే బతికి ఉండగా.. మిగిలిన 17 మంది చనిపోయారు.
ఇలాఉండగా, 2020 నవంబర్ 9 న భూమి యాజమాన్యానికి సంబంధించి సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ నిర్ణయం ప్రకారం, భూమి యాజమాన్యం రామజన్మభూమి ఆలయానికి అనుకూలంగా ప్రకటించబడింది. మసీదు కోసం ప్రత్యేకంగా 5 ఎకరాల భూమి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2021 ఆగస్టు 5 న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేయగా, నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు, అయోధ్య శివారులో కేటాయించిన స్థలంలో మసీదు నిర్మాణం పనులు కూడా చేపట్టారు.
2007: పాఠశాలల్లో సిక్కు విద్యార్థులు క్రిపాన్లు, ముస్లిం బాలికలు హిజాబ్ ధరించేందుకు అనుమతించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం
1978: స్పెయిన్లో 40 ఏళ్ల నియంతృత్వ పాలన అనంతరం తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న దేశ పౌరులు
1956 : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మరణం
1946: భారతదేశంలో హోంగార్డు విభాగం స్థాపన
1921: బ్రిటిష్ ప్రభుత్వం-ఐరిష్ నాయకుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న ఐర్లాండ్
1917: రష్యా నుంచి స్వతంత్ర్య దేశంగా ప్రకటించుకున్న ఫిన్లాండ్
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..