న్యూఢిల్లీ : మణిపూర్ అల్లర్లు పార్లమెంట్ ఉభయసభలనూ కుదిపేశాయి. ఈ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబడుతూ నినాదాలతో హోరెత్తించడంతో లోక్సభ, రాజ్యసభలో గందరగోళం నెలకొంది. పార్లమెంట్లో విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు భయపడే ప్రధాన మంత్రిని తామెన్నడూ చూడలేదని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) అన్నారు. విపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టుకోవడంపై ప్రధాని అభ్యంతరాలను ఆయన తోసిపుచ్చారు.
ఇండియా పదంతో ఆయనకు ఇబ్బంది ఉంటే బీజేపీ ఫర్ ఇండియా నుంచి ఇండియా పదాన్ని తొలగించాలని, అలాగే స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియాల నుంచి ఆయా పదాలను తొలగించాలని కోరారు. ఇండియా పదం వాడటం తమకు గర్వకారణమని దిగ్విజయ్ చెప్పుకొచ్చారు. ఇక రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడుతూ తాము మణిపూర్ గురించి మాట్లాడుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఈస్టిండియా కంపెనీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని, స్వాతంత్ర్య సమరయోధులను అవమానిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రణ్దీప్ సుర్జీవాలా విమర్శించారు. అమెరికా పార్లమెంట్లో మాట్లాడేందుకు ప్రధానికి సమయం ఉంటుందని, అయితే దేశ పార్లమెంట్లో మణిపూర్పై మాట్లాడేందుకు ఆయనకు సమయం లేదని ఆక్షేపించారు. భారత రాజ్యాంగం, పార్లమెంట్ను ప్రధాని మోదీ ఎందుకు ద్వేషిస్తారని సుర్జీవాలా ప్రశ్నించారు. ఇక మణిపూర్ అంశంపై ప్రధాని మాట్లాడాలని విపక్షాలు పట్టుపట్టగా ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడతారని మంత్రి పీయూష్ గోయల్ బదులిచ్చారు. మణిపూర్ అల్లర్ల వ్యవహారం పార్లమెంట్ ఉభయసభలనూ కుదిపేయగా పలుమార్లు సభ వాయిదా పడింది.
Read More :