న్యూఢిల్లీ: ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ(Air Hostess Geetika Sharma) ఆత్మహత్య కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్ కండాను ఢిల్లీ కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఆత్మహత్యకు ప్రేరేపించడం, నేరపూరిత కుట్ర, సాక్ష్యాల ధ్వంసం లాంటి ఆరోపణలను కొట్టిపారేశారు. స్పెషల్ జడ్జి వికాశ్ దుల్ ఈ కేసులో తీర్పు ఇచ్చారు. లక్ష రూపాయల పర్సనల్ బాండ్ ఇవ్వాలని గోపాల్ను కోర్టు ఆదేశించింది.
గోపాల్ కండాకు చెందిన ఎంఎల్డీఆర్ ఎయిర్లైన్స్లో గీతికా శర్మ ఎయిర్ హోస్టెస్గా పనిచేసింది. ఓ దశలో ఆమెను కంపెనీ డైరెక్టర్గా చేశారు. అయితే 2012, ఆగస్టు 5వ తేదీన ఆమె ఆత్మహత్య చేసుకున్నది. ఢిల్లీలోని అశోక్ విహార్ రెసిడెన్స్లో ఆమె శవమై తేలింది. గోపాల్ కండా, అరుణ చద్దా వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన సూసైడ్లేఖలో ఆమె తెలిపింది.
గీతికా శర్మ తల్లి కూడా ఆర్నెళ్ల తర్వాత ఆత్మహత్య చేసుకున్నది. పోలీసుల వేధింపులు, కోర్టు విచారణల వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. భూపేంద్ర సింగ్ హూడా ప్రభుత్వంలో 46 ఏళ్ల గోపాల్ కండా మంత్రిగా చేశారు. అయితే గీతిక కేసు నమోదు తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు.