పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి
టికెట్ల కేటాయింపులో అన్ని వర్గాలకు సమన్యాయం
బీజేపీ, కాంగ్రెస్ల తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు
నగరాన్ని అభివృద్ధి చేసింది, చేసేది టీఆర్ఎస్సే
గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం : మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
66 సీట్లు గెలిచి సీఎం కేసీఆర్కు కానుక ఇద్దాం : మంత్రి సత్యవతి రాథోడ్
వరంగల్పై బీజేపీ, కాంగ్రెస్కు అవగాహనే లేదు
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
18మంది అభ్యర్థులకు బీ ఫారాల పంపిణీ
హన్మకొండ, ఏఫ్రిల్ 21:గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి నేతలందతా కట్టుబడి ఉండాలని, టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న 18మంది అభ్యర్థులకు బుధవారం హన్మకొండలోని తన కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి బీ ఫారాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ టిక్కెట్లు రానివారు బాధపడొద్దని, వారికి సముచిత స్థానం కల్పిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. టిక్కెట్లు వచ్చిన అభ్యర్థులు రాని వారిని కలుపుకొని పోవాలని, పార్టీ గెలుపే లక్ష్యంగా అందరు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. టిక్కెట్లు రానివారు ఏవైనా అభ్యంతరాలుంటే సమన్వయ కమిటీకి తెలియచేయాలని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నగర ప్రజలు మంచి మద్దుతు ఇచ్చి టీఆర్ఎస్ను గెలిపించారని, గ్రేటర్ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులకు ఆశీర్వాదం ఉండాలని ప్రజలకు మంత్రి విజ్ఞపి చేశారు.
అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా టికెట్లు ఇస్తున్నామని, కొన్ని చోట్ల మెరుగైనవారున్నా సామాజిక నాయ్యం కోసం ఉద్యమకారులు, సీనియర్లను కలుపుకొని అందరికీ తగిన గుర్తింపు ఉండేలా కేటాయిస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోనే వరంగల్ అభివృద్ధి చెందుతోందని, నగరానికి బీజేపీ, కాంగ్రెస్ ఒరగబెట్టిందీ లేదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తప్పుడు, అబద్దపు ప్రచారాలు చేసిందని విమరిశంచారు. ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రం చిన్న చూస్తోందన్నారు. రూ.1600కోట్లతో నగరంలో ఇంటింటికీ శుద్ధమైన తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. వరంగల్ ప్రజలు చైతన్యవంతులని, బీజేపీ, కాంగ్రెస్ను చిత్తు చేస్తారని, ప్రజల ఆశీర్వాదంతో బల్దియాపై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని స్పష్టం చేశారు. సమన్వయ కమిటీలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ను చేర్చినట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్కు కానుక ఇద్దాం : మంత్రి సత్యవతి
స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ ముందుగా ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో మొత్తం 66 సీట్లు గెలిచి సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దామన్నారు. ఏడేళ్లకు ముందు, ప్రస్తుతం వరంగల్ నగర పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని, ఎవరెన్ని మాటలు మాట్లాడినా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నగరాన్ని అభివృద్ధి చేసింది వాస్తవమని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధికి నేరుగా బడ్జెట్లో ఏటా రూ.300 కోట్లు కేటాయిస్తున్నదని చెప్పారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే గెలుపు ఖాయనే ధీమాతో ఎక్కువ మంది టికెట్ ఆశిస్తున్నారని, తమ పార్టీలోనే పోటీ ఉందని, వేరే పార్టీలతో టీఆర్ఎస్కు పోటీ లేదని చెప్పారు. సామరస్యంగా ఉన్న వరంగల్లో బీజేపీ నాయకులు అలజడి స్పష్టిస్తున్నాని, ఎన్నికలు రాగానే లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.