శ్రీశైలం : భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వంతోపాటు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు శ్రీశైల క్షేత్ర పరిధిలో విరివిగా మెక్కలను పెంచుతున్నట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం ఆలయ పశ్చిమ మాడవీధిలో కదంబ మొక్కలకు ఆయన శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి సిబ్బందితో కలిసి నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్షేత్ర పరిధిలోని ఉద్యానవనాలు, నర్సరీలు, నక్షత్రవనం, వలయ రహదారి వెంట, ల్యాండ్ స్కేపింగ్లలో రావి, జువ్వి, మర్రి, కానుగ తదితర నీడనిచ్చే మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే నాటిన ఆయుర్వేద మొక్కలు, ఇతర మొక్కలను జాగ్రత్తగా సంరక్షిస్తూ ఏపుగా పెరిగేందుకు సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. దేవస్థానం ఆధ్వర్యంలో త్వరలో ప్రత్యేక పర్యావరణ అవగాహన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఏఈఓ హరిదాసు, ఉప ప్రధానార్చకుడు మణిస్వామి, సహాయ స్థపతి జవహార్, ఏఈ మేఘనాథ్, హార్టికల్చరిస్ట్ లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.
నిత్యాన్నదాన పథకానికి విజయవాడకు చెందిన జీ ఓబుల్ నాయుడు కుటుంబసభ్యులు రూ.లక్ష విరాళం ఇచ్చారు. శనివారం ఆలయ పీఆర్ఓ, అన్నదానం ఇన్చార్జి శ్రీనివాసరావుకు వారు చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జునస్వామివార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామివారి శేషవస్త్రాలు, జ్ఞాపికలతోపాటు ప్రసాదం అందజేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.