హైదరాబాద్ ,మే 12: కార్పోరేట్ సంస్థలు కరోనా మహమ్మారి కష్టకాలంలో సాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు తమవంతుగా పలువిధాలుగా సహకారం అందిస్తున్నాయి. మారుతిసుజుకీ సంస్థ ఉత్పత్తిని నిలిపివేసి ఆక్సిజన్ అందించడంలో నిమగ్నమవగా…టాటా, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, రిలయన్స్ వంటి కంపెనీలు తమవంతుగా కరోనాపై పోరుకు సహకరిస్తున్నాయి.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సేవాభారతి వంటి స్వచ్చంధ సంస్థలు మేమున్నామంటూ ముందుకు వస్తున్నాయి. గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ నెలాఖరు లోపు 7 ఆక్సిజన్ ప్లాంట్లను డీసీఎం శ్రీరామ్ ఏర్పాటు చేయనునుంది. పేటీఎం ఫౌండేషన్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ సహా 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు గుజరాత్కు అందించనున్నది. భారత్లో కరోనా ఉపశమన చర్యలకు దాదాపు రూ.110 కోట్ల సాయాన్ని ప్రకటించింది ట్విటర్. ఈ మొత్తాన్ని ప్రభుత్వేతర సంస్థలైన కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్ఏలకు అందించనున్నది.
దేశంలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు, రవాణా సమస్యలు తొలగించేందుకు వీలుగా మారుతీ సుజుకీ ఎయిరోక్స్ నైజెన్ ఎక్విప్మెంట్స్, శాం గ్యాస్ ప్రాజెక్ట్స్ అనే పీఎస్ఏ ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్స్ కంపెనీలతో చేతులు కలిపింది. ఈ సంస్థలు ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ల తయారీలో ఉన్నాయి. వీటి ఉత్పత్తి పెంచేందుకు మారుతీ సహకరిస్తుంది.
ఈ రెండు కంపెనీలు చిన్న తరహావి. దీంతో ఉత్పత్తిని పెంచలేకపోతున్నాయి. నెలకు 5 నుంచి 8 ప్లాంట్స్నే ఉత్పత్తి చేయగలుగుతున్నాయని, అందుకే తమ వనరులను ఉపయోగించి ఆ రెండు సంస్థలు ప్లాంట్స్ ఉత్పత్తి పెంచేలా చర్యలు తీసుకుంటామని మారుతి సుజుకీ పేర్కొన్నది. కరోనాపై పోరుకు ఐటీ దిగ్గజాలు తమవంతు సహకారం అందిస్తున్నాయి. అందులోభాగంగా ఇప్పటికే ఇన్ఫోసిస్ రూ.100 కోట్ల విరాళం ప్రకటించగా … విప్రో, టెక్ మహీంద్రా వంటి దిగ్గజాలు కూడా తమవంతుగా సాయమందిస్తున్నాయి. కొన్నిచోట్ల ఆయా సంస్థలు తమ ప్రాంగణంలో కరోనా కేర్ సెంటర్లను ఏర్పాటు చేశాయి.