న్యూఢిల్లీ : సరిహద్దు రాష్ట్రం మణిపూర్ అల్లర్లతో మండిపోతుంటే ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్లో మణిపూర్ ప్రస్తావన తీసుకురావడం లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మండిపడ్డారు. మణిపూర్ ఘర్షణలతో అనిశ్చితి, కల్లోల వాతావరణం నెలకొంటే మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం సరిహద్దు రాష్ట్రాన్ని అలక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
మణిపూర్ను సందర్శించేందుకు అఖిల పక్ష బృందాన్ని కేంద్రం అనుమతించాలని ఖర్గే డిమాండ్ చేశారు. మణిపూర్లో పరిస్ధితి ఆందోళనకరంగా మారినా ప్రధాని మోదీ మౌనం దాల్చారని విమర్శించారు. రాష్ట్రంలో పరిస్ధితిపై చర్చించేందుకు ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయలేదని, అఖిల పార్టీ సమావేశానికీ మోదీ చొరవచూపలేదని దుయ్యబట్టారు. మీ ప్రభుత్వం మణిపూర్ను భారత్లో భాగంలా చూడటం లేదని అనిపిస్తోందని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ చీఫ్ స్పష్టం చేశారు.
మితై ఇతర వర్గాల మధ్య అల్లర్లతో మణిపూర్ కొద్దిరోజులుగా అట్టుడుకుతుండగా తాజా అల్లర్లు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మే 3న జరిగిన ర్యాలీ అనంతరం హింస ప్రజ్వరిల్లడంతో పలు జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఇక మణిపూర్ మండుతుంటే మీ ప్రభుత్వం నిద్రలో జోగుతున్నదని ఖర్గే ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. మణిపూర్లో శాంతిని భగ్నం చేస్తున్న శక్తులపై చర్యలు చేపట్టి ప్రధాని రాజధర్మాన్ని అనుసరించాలని ఆయన కోరారు.
Read More :