చెన్నై: మంత్రి, ఎంపీ గొడవపెట్టుకుని అడ్డుచెప్పబోయిన జిల్లా కలెక్టర్ను తోసిపడేశారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. అంతకుముందే ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ రాష్ట్రమంత్రి రాజ కన్నప్పన్కు, స్థానిక ఎంపీ నవాస్ ఖనికి ఆహ్వానాలు పంపించారు.
ఇవాళ ఉదయం మంత్రి రాజకన్నప్పన్ హాజరయ్యే సమయానికి ఎంపీ నవాస్ ఖని ఇంకా రాలేదు. దాంతో మంత్రి, జిల్లా కలెక్టర్ కలిసి అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రారంభించారు. అదే సమయంలో వచ్చిన ఎంపీ నవాస్ ఖని తాను రాకముందే కార్యక్రమాన్ని ఎలా ప్రారంభిస్తారంటూ గొడవకు దిగారు. ఈ సందర్భంగా మంత్రికి, ఎంపీకి, ఆ ఇద్దరి అనుచరులకు మధ్య తోపులాట జరిగింది.
దాంతో అక్కడే ఉన్న కలెక్టర్ గొడవ పడుతున్న నేతలిద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లు ఆయనను తోసిపడేశారు. అయితే అక్కడే సోఫా ఉండటంతో ఆయన కింద పడిపోకుండా ఆ సోఫాలో కూలబడిపోయారు. కలెక్టర్ కిందపడిపోయినా మంత్రి, ఎంపీ మాత్రం తమ గొడవను ఆపలేదు. ఇరువర్గాలు అలాగే తోపులాట కొనసాగించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.