Waqf Amendment Bill : వక్ఫ్ బోర్డు అధికారాలను నియంత్రిస్తూ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024ను కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ వ్యతిరేకించారు. ఈ బిల్లును రాజ్యాంగంపై దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ సవరణ బిల్లు ద్వారా వక్ఫ్ గవర్నింగ్ కౌన్సిల్లో ముస్లిమేతరులను కూడా సభ్యులుగా చేర్చే నిబంధనను తీసుకొస్తున్నారని అన్నారు. ఇది మత స్వేచ్ఛపై నేరుగా చేపట్టిన దాడేనని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆపై కాషాయ పాలకులు క్రైస్తవులు, జైనులను కూడా లక్ష్యంగా చేసుకుంటారని ఆరోపించారు. దేశ ప్రజలు ఇప్పుడు ఇలాంటి విభజన రాజకీయాలను సహించబోరని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. కాగా, అంతకుముందు వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న వార్తలపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తిని తొలగించి దాన్ని తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలని మోదీ సర్కార్ యోచిస్తోందని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని కేంద్రం భావిస్తున్నదని అన్నారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఔన్నత్యం, హక్కులకు భిన్నంగా పార్లమెంట్లో వెల్లడించని విషయాలపై మీడియాకు సమాచారం అందిస్తున్నదని ఓవైసీ మండిపడ్డారు. మీడియా కథనాల ప్రకారం వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తిని మోదీ ప్రభుత్వం తొలగించాలని యోచిస్తోందని వెల్లడవుతున్నదని చెప్పారు. బీజేపీ తొలి నుంచీ ఈ బోర్డులకు, వక్ఫ్ ఆస్తులకు వ్యతిరేకమని, కాషాయ పాలకులు హిందుత్వ అజెండాపై పనిచేస్తున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం వక్ఫ్ చట్టానికి సవరణలు చేపడితే నిర్వహణ పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని వక్ఫ్ బోర్డు ప్రభుత్వం నియంత్రణలోకి వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు స్వతంత్ర ప్రతిపత్తి దెబ్బతింటుందని పేర్కొన్నారు. వివాదాస్పద ఆస్తులు ఏమైనా ఉంటే బీజేపీ పాలకులు, సీఎంలు వాటిపై సర్వే చేయిస్తామని చెబుతారని, ఆపై వీరి సర్వే ఎటు దారితీస్తుందనేది తెలిసిన విషయమేనని పేర్కొన్నారు.
Read More :