– 100 మంది సంతకాలతో గని మేనేజర్కు వినతి
– జేఎంఈటీ ఉద్యోగి వసీం ఖాన్కు న్యాయం చేయాలని డిమాండ్
– ఫార్మసీ సిబ్బంది వ్యవహారంపై విచారణ కోరిన కార్మికులు
రుద్రంపూర్, ఆగస్టు 01 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి గనిలో జేఎంఈటీ ఉద్యోగిగా పనిచేస్తున్న ఎం. వసీం ఖాన్కు జరిగిన ఘటనపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో కార్మికులకు అందుతున్న వైద్య సేవల్లో నిర్లక్ష్యాన్ని ప్రస్తావిస్తూ సుమారు 100 మంది ఉద్యోగుల సంతకాలతో పద్మావతి గని మేనేజర్ రవికిరణ్ యూనియన్ నాయకులు, కార్మికులు వినతిపత్రం సమర్పించి చర్యలు తీసుకోవాలని కోరారు. గత నెల 30వ తేదీన పంటి నొప్పితో బాధపడుతున్న వసీం ఖాన్ సింగరేణి ప్రధాన ఆసుపత్రికి వెళ్లగా, వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ పన్ను పీకించుకుని తిరిగి సంబంధిత మందుల కోసం ఫార్మసీకి వెళ్లగా సుమారు పావుగంటపాటు వేచి ఉన్నప్పటికీ సిబ్బంది అందుబాటులో లేరని పేర్కొన్నారు.
సిబ్బంది ఎక్కడ ఉన్నారని ప్రశ్నించగా “స్నాక్స్ టైం” అంటూ దురుసుగా సమాధానం ఇచ్చారని, మందులు ఎలా వాడాలని అడిగితే “డాక్టర్ను అడుక్కోండి” అంటూ నిర్లక్ష్యంగా స్పందించారని వినతిపత్రంలో ఆరోపించారు. తీవ్ర పంటి నొప్పితో బాధపడుతున్న వసీం ఖాన్ దీనిపై గట్టిగా ప్రశ్నిస్తూ మాట్లాడే క్రమంలో, చేతికి ఉన్న బ్రాస్లెట్ ఫార్మసీ అద్దానికి తగలడంతో అద్దం పగిలిందని తెలిపారు. ఆ సమయంలో పగిలిన అద్దం పెంకులు చేతికి గుచ్చుకుని గాయమవడంతో, అదే సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ ఘటనను ఆసరాగా చేసుకుని తమ నిర్లక్ష్యం బయటపడుతుందనే ఉద్దేశంతో కొందరు సిబ్బంది వసీం ఖాన్పై తప్పుడు ప్రచారం చేశారని, చీఫ్ మెడికల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేయడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో కూడా అసత్య ప్రచారం చేశారని కార్మికులు ఆరోపించారు.దీనిపై స్పందించిన వసీం ఖాన్కు మద్దతుగా సుమారు 100 మంది ఉద్యోగులు సంతకాలు చేసి గని మేనేజర్కు వినతిపత్రం అందజేశారు.
సింగరేణి ఆసుపత్రిలో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, ఫార్మసీ సిబ్బంది వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఘటనపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ కు కూడా వినతిపత్రం ఇవ్వనున్నట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఈ వినతి పత్రం అందజేసిన వారిలో ఐ ఎన్ టి యు సి కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి రజాక్, టీబీజీకేఎస్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, బోరింగ్ శంకర్, గోల్కొండ నవీన్ , దేవ్ సింగ్, రంజిత్, వెంకటేశ్వర్లు, శంకర్, ఐ ఎన్ టి యు సి ఫిట్ సెక్రటరీ చిలక రాజయ్య, ఏ ఐ టి యు సి సాయి పవన్, సింగరేణి బీసీ ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ సకినాల సమ్మయ్య, బి ఎం ఎస్ నాగేశ్వరరావు, హెచ్ ఎం ఎస్ ఆసిఫ్ పాల్గొన్నారు.