బూర్గంపహాడ్, సెప్టెంబర్ 19 : భూ రీ సర్వే పనులను నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బూర్గంపహాడ్ మండల పరిధిలోని పినపాక పట్టీనగర్ రెవెన్యూ విలేజ్ పరిధిలో అంజనాపురం ప్రాంతంలో కొనసాగుతున్న డిజిటల్ భూ రీ సర్వే పనులను శనివారం క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేక పరికరాలతో నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ భూముల కొలతలు, సర్వే విధానం, వివరాల నమోదు అంశాలను తాసీల్దార్ కేఆర్కే ప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పూర్తయిన పనుల పురోగతిపై సమీక్ష చేశారు. 1863 ఎకరాలకు 1698 ఎకరాల్లో సర్వే పూర్తయిందని లైసెన్స్ సర్వేయర్లు యుగంధర్, అనూషలు కలెక్టర్కు వివరించారు. అటవీశాఖకు సంబంధించిన 200 ఎకరాల భూములకు అనుమతులు లభించలేదని, అనుమతులు వచ్చిన వెంటనే వాటి సరిహద్దుల సర్వేను పూర్తిచేస్తామని తెలిపారు. మిగిలిన పనులు కూడా పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
రైతులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ వారి అభిప్రాయాలు, సమస్యలు, సందేహాలను అడిగి తెలుసుకున్నారు. సర్వే సమయంలో భూ యజమానులు తమ భూములకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులకు అందించి సహకరించాలని కోరారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్న డిజిటల్ రీ సర్వేతో భూముల వివరాలు ఖచ్చితంగా నమోదవుతాయని, భవిష్యత్లో భూ సంబంధిత సమస్యలు తగ్గించే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అధికారులు, సర్వే సిబ్బంది, రైతులు సమన్వయంతో పనిచేసి రీ భూ సర్వేను విజయవంతంగా పూర్తిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలు ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలో పంచాయతీ సర్పంచ్ బానోత్ పద్మ, ఉప సర్పంచ్ వెంకటరమణ, అధికారులు, సర్వే సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.