Katchatheevu : తమిళనాడు రాజకీయాల్లో కచ్చతీవు అంశం కాక రేపుతోంది. చారిత్రక పోరాటాలపై పసలేని వివాదాలను తెరపైకి తీసుకురావడం బీజేపీకి అలవాటుగా మారిందని కచ్చతీవు అంశంపై స్పందిస్తూ కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం అన్నారు. వారికి ముందుగా బాబర్పై ఫిర్యాదు ఉందని, ఆపై ఔరంగజేబుపై వ్యతిరేకత నూరిపోశారని, ఆపై వారికి ఈస్ట్ ఇండియా కంపెనీతో సమస్య ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఇక పండిట్ జవహర్లాల్ నెహ్రూను కించపరుస్తారని కార్తి చిదంబరం అన్నారు. బీజేపీకి కాంగ్రెస్తో నిరంతరం ఏదో ఒక పోరాటం సాగించడం అలవాటని చెప్పారు. కచ్చతీవు అంశం 50 ఏండ్ల కిందటే రెండు దేశాల మధ్య పరిష్కారమైందని గుర్తుచేశారు. ఇరు దేశాలు ఏనాడో ఒప్పందాలు చేసుకోగా, ఇప్పుడు అనూహ్యంగా ఈ వ్యవహారాన్ని లేవనెత్తారని అన్నారు.
తమిళనాడులో రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చిందని, తమిళనాడులో వాస్తవ రాజకీయాలకు బీజేపీ ఎంతదూరంగా ఉందో ఈ అంశం తేటతెల్లం చేస్తోందని కార్తీ చిదంబరం దుయ్యబట్టారు. కాగా భారత్కు చెందిన కచ్చతీవు దీవిని 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించింది. ఈ ఉదంతం తమిళనాట ఎప్పటినుంచో చర్చలకు కేంద్ర బిందువవుతోంది. చేపల వేటకు ఈ దీవులకు వెళ్లే తమిళ జాలర్లపై శ్రీలంక దళాలు దాడులకు తెగబడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. తమిళనాడులో ఎన్నికల సమయంలో కచ్చతీవు రాజకీయ అంశంగా మారుతుండటం ఆపై సమసిపోవడం జరుగుతుంటుంది.
Read More :
Harish Rao | హనుమాన్ చాలీసాను 2 నిమిషాల్లో చదివేస్తాను.. బీజేపీకి హరీశ్రావు చురకలు