Harish Rao | వరంగల్ : రాష్ట్రంలోని బీజేపీ నేతలకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చురకలంటించారు. వీళ్లే భక్తులు అన్నట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మనం కూడా దేవుళ్లను పూజిస్తామని, తాను రెండు నిమిషాల్లోనే హనుమాన్ చాలీసా చదివేస్తానని హరీశ్రావు తెలిపారు. వరంగల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్రావు పాల్గొని ప్రసంగించారు.
పదేండ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు చేసిందేమీ లేదు. బీజేపీ మాట వింటే జోడి.. వినకపోతే తెల్లారీ ఈడీ.. ఇది ఇవాళ ఈ దేశంలో రాజకీయ పరిస్థితి. విదేశాల్లో నల్లధనం తెస్తామని, ఒక్కోక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ పదేండ్లలో ఒక కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారు. నల్లచట్టాలు తెచ్చి రైతులను పొట్టన పెట్టుకుంది బీజేపీ ప్రభుత్వం. పెట్రోల్, డిజీల్ ధరలు పెంచారు. బీజేపీ పాలనలో ఈ దేశంలో ఆకలి, పేదరికం, నిరుద్యోగం పెరిగింది. బీజేపీ పాలనలో సీబీఐ, ఈడీ కేసులు మాత్రం పెరిగాయని హరీశ్రావు మండిపడ్డారు.
బీజేపోళ్లు ఏమన్న అంటే రామాలయం అంటారు. రాముడిని అందరం మొక్కుతాం. మనం కూడా హనుమాన్ చాలీసా చదువుతాం. బీజేపోళ్లకు వస్తదో.. రాదో తెల్వదు కానీ.. తాను హనుమాన్ చాలీసా రెండు నిమిషాల్లో చదువుతాను. హనుమాన్ చాలీసా చదవనిదే, పూజ చేయనిదే బయటకు వెళ్లాం. దేవుడు అందరివాడు. బీజేపోళ్లకు మాత్రమే దేవుడు అన్నారని అనుకుంటారు. అద్భుతమైన యాదాద్రి కట్టారు కేసీఆర్. మనం కూడా అక్షింతలు పంచినట్టు.. ఇంటికో యాదాద్రి లడ్డూ పంచి రాజకీయాలు చేయలేదు. రాజకీయాలకు దేవుళ్లను వాడుకోలేదు. బీజేపీ నాయకులు చేసింది ఏం లేదు కాబట్టి మతం పేరిట రాజకీయాలను చేస్తున్నారు. జాతీయ పార్టీలకు గులాం గిరి చేసేవాళ్లు కావాల్నా.. తెలంగాణ గళం వినిపించే వాళ్లు కావాల్నా ఆలోచించాలి అని వరంగల్ ప్రజలకు హరీశ్రావు సూచించారు.