గువాహతి: బీజేపీ సీఎం హిమంత బిస్వా శర్మ తెలివి తక్కువ చర్యల వల్ల అస్సాంలో అమాయక బాలికలు చనిపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ విమర్శించారు. ఒక గర్భిణీ బాలిక మరణంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాల్య వివాహాలపై ప్రభుత్వం కఠిన చర్యల వల్ల గర్భం దాల్చిన 18 ఏళ్లలోపు బాలికలు ప్రసవం కోసం ఆసుపత్రులకు వెళ్లడం లేదన్నారు. తమ తండ్రులు, భర్తలను పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఇంటి వద్దే కాన్పులకు ప్రయత్నిస్తూ మరణిస్తున్నారని ట్విట్టర్లో ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిటీ సిబ్బంది, ఆశా వర్కర సహాయం లేక బొంగైగావ్ జిల్లాలో 16 ఏళ్ల గర్భిణీ వివాహిత బాలిక చనిపోయిందని తెలిపారు. ప్రసవ సమయంలో వచ్చే సమస్యలు, రక్తస్రావంతో సీరియస్ పరిస్థితిలో ఉన్న ఆ యువతి శిశువును ప్రసవించి మరణించిందని చెప్పారు.
కాగా, శిశువు తండ్రి జైలులో ఉన్నాడని, దీంతో పుట్టిన వెంటనే అనాధ అయ్యిందని గౌరవ్ గొగోయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అస్సాంలో బాల్య వివాహాల అణచివేతపై సీఎం హిమంత బిస్వా శర్మ తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయం వల్ల అమాయక బాలికలు చనిపోతున్నారని ట్విట్టర్లో మండిపడ్డారు.
మరోవైపు బాల్య వివాహ నిషేధ చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో అస్సాం పోలీసులు ఇప్పటి వరకు సుమారు మూడు వేల మంది మగవారిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అస్సాం మంత్రివర్గం ఆ రాష్ట్ర పోలీసులను గురువారం అభినందించింది. బాల్య వివాహాలను కఠినంగా అణచివేయాలని ఆదేశించింది. అలాగే బాల్య వివాహ బాధితులకు పునరావాస పాలసీని ఖరారు చేసేందుకు ఒక సబ్ కమిటీ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
This innocent girl’s death is on the hands of BJP Chief Minister Himanta Biswa Sarma whose foolish step has led to pregnant teenagers avoiding hospitals for their childbirth. The infant is without a mother and the father is in jail. https://t.co/JodMauhCwY
— Gaurav Gogoi (@GauravGogoiAsm) February 10, 2023