One Nation One Election | దేశంలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని కేంద్రం గత కొన్ని రోజులుగా కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా జమిలి ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ‘ఒకే దేశం – ఒకే ఎన్నికలు’ (One Nation One Election) అంశంపై ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ (Ram Nath Kovind) నేతృత్వం వహించనున్నట్లు తెలిసింది. అయితే, ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పలు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జమిలి ఎన్నికల అంశంపై కేంద్రం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘ఒకే దేశం – ఒకే ఎన్నికల’కు అవకాశాలను కోవింద్ కమిటీ పరిశీలించనుంది.
మరోవైపు సెప్టెంబర్లో ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Session) నిర్వహించనున్నట్లు గురువారం కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు అనూహ్య ప్రకటన చేసింది. అయితే, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే జమిలి ఎన్నికల కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. కాగా, ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికల కోసం ప్రత్యేక బిల్లును తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దేశంలో ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ పద్ధతికి కేంద్రంలోని మోదీ సర్కార్ ఎప్పటినుంచో కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. జమిలి కోసం లా కమిషన్ సిఫారసులు కూడా చేసింది. జమిలి ఎన్నికలు అంటూ వస్తే నిర్వహించాడనికి తాము సిద్ధమేనని ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉందని ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే జమిలి కోసం చట్టసవరణ చేయడానికే ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశ పరుస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం లోక్సభ (Lok Sabha)ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read..
Parliament Session | ముందస్తుకు వెళ్తారా.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అసలు కారణం అదేనా?