Congress | హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): ఖమ్మం రాజకీయాలు రంజుగా మారాయి. గత ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావును ఓడించేందుకు అంతర్గతంగా కుట్ర చేసిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడాయనకు చెక్ పెటేందుకు తుమ్మలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ వర్గం ప్రయత్నిస్తున్నది. గురువారం తుమ్మల ఇంటికి వెళ్లిన రేవంత్రెడ్డి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
పొంగులేటి వర్గానికి ఇది షాకిచ్చింది. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పొంగులేటి భావిస్తుండగా, ఆయనకిప్పుడు తుమ్మల రూపంలో ఎదురుదెబ్బ తగలనుంది. మరోవైపు, షర్మిల కనుక పార్టీలోకి వస్తే తాను ఖమ్మం నుంచైనా పోటీకి రెడీ అని తుమ్మల చెబుతున్నారు. ఇలా ఎవరికి వారు తమ ప్రణాళికల్లో బిజీగా ఉన్నారు. ఇంకోవైపు, తుమ్మల, పొంగులేటి, షర్మిల పార్టీలోకి వస్తే తన పరిస్థితి ఏంటన్న అయోమయంలో సీనియర్ నేత రేణుకా చౌదరి గుర్రుగా ఉన్నారు.