Srisailam project | ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్ట్కు(Srisailam project) వరద ప్రవాహం (Flood) కొనసాగుతోంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2,32,308 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 876.20 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 169.46 టీఎంసీలకు చేరింది.
ఈ క్రమంలో అధికారులు కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి చేసి 66,460 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,133 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు 8 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా ఎత్తిపోతల పథకానికి 875 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాగా, కృష్ణా నదిలో వరద ప్రవాహం పరవళ్లు తొక్కుతున్నా రేవంత్ సర్కార్ కపట నీతితో అన్నదాత కంటనీరు పెట్టుకోవాల్సిన దుర్గతి పడుతున్నది.
జూరాల, శ్రీశైలం జలాశయాలు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నా ఏపీకి దోచి పెట్టేందుకే తెలంగాణ రైతుల ఆశలను కాంగ్రెస్ నీరుగారుస్తున్నది. ఒకవైపు కృష్ణా, భీమా నదులు పొంగిపొర్లుతూ శ్రీశైలం వైపు పరుగులు తీస్తుంటే రాష్ట్ర సర్కార్ పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోయకుండా దోబూచులాడుతున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి నాలుగు మోటర్లు సిద్ధంగా ఉన్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మరో నాలుగు మోటర్లతో కూడా నీటిని ఎత్తిపోయొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రెండు ప్రాజెక్టులకు నీటిని వదలకుండా కృష్ణా జలాలను వృథాగా దిగువకు వదిలిపెడుతున్నది.