జెరుసలాం: ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఇజ్రాయిలీ మీడియాలో దీనికి సంబంధించిన కథనం వెలుబడింది. ఇరాన్ వర్గాలను ఊటంకిస్తూ ఛానల్ 14 ఓ వార్తను ప్రసారం చేసింది. ఇరాన్ అధ్యక్షుడు మాసౌద్ పెజెష్కియాన్ ప్రభుత్వ వర్గాలు కూడా ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దేశంలో ఉన్న ఉన్నత స్థాయి అధికారుల దగ్గర మొజ్తాబా ఖమేనీ సమాచారం ఉన్నట్లు తెలిసింది. మొజ్తాబా ఖమేనీ మరణ వార్తను త్వరలోనే విన్నా ఆశ్చర్యం లేదని జెరుసలాం పోస్టు తన కథనంలో పేర్కొన్నది.
ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన దాడిలో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణం నేపథ్యంలో సుప్రీంనేతగా అలీ ఖమేనీ కుమారుడైన మొజ్తాబా ఖమేనీ విధులు నిర్వర్తించారు. కానీ అమెరికా-ఇజ్రాయిల్ దాడిలో మొజ్తాబా కూడా గాయపడినట్లు తెలిసింది. ఫిబ్రవరి 28వ తేదీ దాడి నుంచి ఇప్పటి వరకు మొజ్తాబా ఆచూకీ లేదు. అమెరికా దాడిలో మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డారని, ఆయన్ను గుర్తించడం కష్టమే అని కొన్ని వార్తలు అప్పట్లో వెలుబడ్డాయి.
రహస్య ప్రదేశంలో చికిత్స పొందుతున్న ఆయన.. ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. అయితే మొజ్తాబాతో నేరుగా మాట్లాడే అవకాశాలు చాలా తక్కువే అని అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తెలిపారు.