పార్లమెంట్ ప్రొరోగ్ అయి రెండున్నర వారాలు గడవకముందే మళ్లీ సమావేశాలు నిర్వహించాలని కేంద్రప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకొన్నది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదురోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్టు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ఎక్స్ (ట్వీట్) చేశారు. అయితే, ఇంత అత్యవసరంగా సమావేశాలు నిర్వహిస్తున్న కేంద్రం, అందుకు కారణంగానీ, సమావేశాల ఎజెండాగానీ వెల్లడించకపోవటంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సమావేశాలే 17వ లోక్సభకు చివరివి కాబోతున్నాయని, లోక్సభను రద్దుచేసి బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నదని జోరుగా ప్రచారం సాగుతున్నది. దీనిపై కేంద్రంగానీ, బీజేపీగానీ నోరుమెదుపటం లేదు. మరి ఇంత అర్జెంట్గా పార్లమెంటు తిరిగి సమావేశాలు పెట్టడం వెనుక మతలబు ఏమిటన్నది దేశ రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Parliament Session | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు నిర్వహించారు. అంతలోనే మళ్లీ సమావేశాలు ఉంటాయని కేంద్రం ప్రకటించింది. ఈ ఐదు రోజుల సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమై, కొత్త భవనంలో ముగుస్తాయని అంటున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సంకేతాలిచ్చిన కేంద్రం.. ఇంత అత్యవసరంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఎందుకు నిర్వహిసున్నట్టు? మోదీ సర్కారు ముందస్తు ఎన్నికలకు మొగ్గు చూపుతున్న సంకేతాలు ఉన్నప్పటికీ స్పష్టత మాత్రం రాలేదు. అయితే, బీజేపీకి గతంలో ముందస్తు ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.
గతంలో వాజపేయి సర్కార్ ‘ఫీల్ గుడ్ ఫ్యాక్టర్’గా అంచనా వేసి ముందస్తుకెళ్లి బొక్కాబోర్లా పడింది. ఆ అనుభవం దృష్ట్యా ఇప్పుడు బీజేపీ ముందస్తుకు వెళ్లే అవకాశం లేదనే వాదన కొందరు వినిపిస్తున్నారు. కేంద్రంలో తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదని మ్యానిప్లేటెడ్ సర్వేలు ఊదరగొడుతున్నాయి. వాస్తవానికి ఉత్తరప్రదేశ్, గుజరాత్లో తప్ప బీజేపీ సొంతంగా అధికారంలో ఎక్కడా లేదు. భాగస్వామ్య పక్షాల మద్దతుతోనో, ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడం ద్వారానో అధికారంలోకి వచ్చింది. ముస్లిం ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సన్నద్ధమవుతున్నారు. ఈ విషయం ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ పార్టీకి అనుకూలంగా ఉండే ముస్లిం ఓటర్లు, బీజేపీని ఓడించే పార్టీ వైపే మొగ్గు చూపారు. మైనార్టీ ఓటర్లలో ఈ ట్రెండ్ ఇతర రాష్ర్టాలకు పాకకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం భావిస్తూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా సర్వేలన్నీ అనుకూలంగా రావడం ముందస్తు ఎన్నికలకు సంకేతమా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఈ నెల 8 నుంచి 10వ వరకు ఢిల్లీలో జీ-20 సమావేశాలు జరగబోతున్నాయి. 2033 నాటికి ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నదని జీ-20 దేశాల ప్రతినిధులతో కితాబు ఇప్పించుకోవడం, చంద్రయాన్-3 విజయంతో భారత్ ప్రతిష్ఠ అంతర్జాతీయంగా పెరిగిందంటూ ఈ సమావేశాల్లో చాటుకోవడం ద్వారా సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలలో సానుకూల ప్రచారం పెంపోందించుకోవడం బీజేపీ సర్కార్ వ్యూహంగా అంచనా వేస్తున్నాయి. ఇవేకాకుండా సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి విజయం సాధించే దిశగా ప్రజాకర్షక పథకాల ప్రకటన కానీ, ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్), మహిళా రిజర్వేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి కొన్ని కీలక బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించుకోవడానికిగానీ ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెడుతుండవచ్చని మరో వాదన వినిపిస్తున్నది.
సార్వత్రిక ఎన్నికలు టార్గెట్గా విపక్ష పార్టీల కూటమి ఇప్పటికే పాట్నా, బెంగళూర్లో సమావేశమై తాజాగా ముంబైలో సమావేశమయ్యాయి. కేంద్రంలో బీజేపీ సర్కార్కు వ్యతిరేకంగా ఈ కూటమి చేస్తున్న దాడితో మోదీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. దీనికి తోడు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బనం, అదానీ అంశం, చైనా దురాక్రమణ, మణిపూర్ ఘటనలు తదితర అంశాలతో ప్రధాని మోదీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతున్నది. కేంద్రంపై ప్రజలలో వ్యతిరేకత మరిం త పెరగకముందే, విపక్షాలు కుదురుకోకముందే ముందస్తు ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టు విపక్ష పార్టీలు అంచ నా వేస్తున్నాయి. పార్లమెంట్కు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీశ్కుమార్ ఇప్పటికే అనుమానం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మే లోగా పూర్తి కావాలి. ఆ సమయంలో ఎండల తీవ్రతతోపాటు, ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత అప్పటికి మరింత బలపడే అవకాశం ఉన్నది. అలాంటి పరిస్థితి రాకముందే ముందస్తు ఎన్నికలకు వెళితే మునుపటి కంటే సీట్లు తగ్గినా తిరిగి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన బీజేపీ వ్యూహం కావచ్చని అంటున్నారు. ఆ పరిస్థితి ఉత్పన్నం కాకముందే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ముందుస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకపోలేదని విపక్షాలు అనుమానిస్తున్నాయి.