CAA Implements | సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ సహా తృణమూల్, సీపీఐ, ఆప్, సమాజ్వాదీ తదితర పార్టీలు ఈ చట్టాన్ని ఇప్పటికే వ్యతిరేకిస్తున్నాయి. తమ రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు (Tamil Nadu) సీఎం స్టాలిన్ (CM Stalin) సైతం ఈ చట్టాన్ని వ్యతిరేకించారు.
సీఏఏ చట్టం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని, అలాంటి చట్టాన్ని తమిళనాడు రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టం చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వల్ల ఎలాంటి ఉపయోగం గానీ, ప్రయోజనాలు గానీ లేవు. ఇది పూర్తిగా అసమంజసమైనది. ఇది భారతీయ ప్రజల మధ్య విభేదాలను సృష్టిస్తుంది. దీనిని తప్పనిసరిగా రద్దు చేయాలి’ అని సీఎం స్టాలిన్ ఓ ప్రకటనలో తెలిపారు.
సీఏఏ నిబంధనలు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఈ చట్టం బహుళవాదం, లౌకికవాదం, మైనారిటీ వర్గాలకు, శ్రీలంక తమిళ శరణార్థులకు కూడా వ్యతిరేకంగా ఉందని అన్నారు. అందుకే సీఏఏని అమలు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ఎటువంటి అవకాశం ఇవ్వబోదని తేల్చి చెప్పారు. లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) ముందు ఈ సీఏఏ నోటిఫికేషన్ను ఎందుకు విడుదల చేశారు..? అంటూ కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వాన్ని సీఎం స్టాలిన్ ప్రశ్నించారు.
లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. నాలుగేండ్ల కిందట ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)ను తాజాగా అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అర్హులైన వారు భారత పౌరసత్వం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఓ పోర్టల్ను కూడా ప్రారంభించారు. https://indiancitizenshiponline.nic.in వెబ్ పోర్టల్ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం అందుబాటులోకి తెచ్చింది.
Also Read..
CAA Implements | సీఏఏ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
CAA Implements | సీఏఏ అమలుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్
Aadhaar Update | గడువు పొడిగింపు.. మరో 3 నెలలు ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు