నమస్తే నెట్వర్క్, జూలై 31 : తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రజలకు అంకితభావంతో సేవలందించిన గొప్ప నాయకుడని, బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు కొనియాడారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు శుక్రవారం సంతాపం వ్యక్తం చేసి నివాళులు అర్పించారు.

మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు నర్సంపేటలోని ఆయన నివాసానికి వెళ్లి పెద్ది సుదర్శన్రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పెద్ది సుదర్శన్రెడ్డికి నివాళి అర్పించిన వారిలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ ఉన్నారు. ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ రాజకీయాలకు తీరనిలోటని పేర్కొన్నారు.