జెరూసలెం : ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ (Hamas attack) మధ్య భీకర పోరు కొనసాగుతోంది. దాడులు, ప్రతిదాడులతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్పై హమాస్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన నేపాల్కు చెందిన నలుగురి మృతదేహాలను ఆదివారం ఖట్మండుకు తీసుకువచ్చారు. విద్యార్ధుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది. నేపాల్ విదేశాంగ మంత్రి, నేపాల్లో ఇజ్రాయెల్ రాయబారి, పలువురు ఉన్నతాధికారులతో కలిసి ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు.
ఇజ్రాయెల్లో 1400 మృతదేహాలున్నాయని, వాటిని తాము గుర్తించనున్నామని నేపాల్కు ఇజ్రాయెల్ రాయబారి హనన్ గోదర్ పేర్కొన్నారు. నేపాల్కు చెందిన విద్యార్ధి బిపిన్ జోషి ఇజ్రాయెల్పై హమాస్ దాడి జరిగినప్పటి నుంచి కనిపించకుండా పోయాడని చెప్పారు. మృతదేహాలను తాము గుర్తించే పనిలో పడ్డామని, బిపిన్ జోషిని తాము మరువలేమని, ఈవెంట్లో పాల్గొన్న జోషీని హమాస్ ఉగ్రమూకలు అపహరించాయని చెప్పారు. అతడు ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని, జోషీ కోసం గాలిస్తున్నామని ఆయన వివరించారు.
బందీలుగా ఉంచుకున్న పౌరులను విడిచిపెట్టాలని తాము టెర్రరిస్టులను కోరుతున్నామని ఈ విషయంలో చొరవ చూపాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నామని అన్నారు. ఇక ఇజ్రాయెల్లో మరణించిన విద్యార్ధులు నారాయణ్ ప్రసాద్ నుపానె, లోకేంద్ర సింగ్ ధామి, దీపేష్ రాజ్ బిస్తా, ఆశిష్ చౌధరి మృతదేహాలను ఖట్మండులో ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Read More :