టెల్ అవీవ్: ఇజ్రాయోల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం (Israel-Hamas War) మరింత తీవ్ర రూపం దాల్చుతున్నది. గాజా నివాసితులను ఇజ్రాయెల్ ఆర్మీ మరోసారి హెచ్చరించింది. పాలస్తీనియన్లు ఉత్తర గాజా నుంచి దక్షిణం వైపునకు వెళ్లాలని మరోసారి అల్టిమేటమ్ ఇచ్చింది. లేని పక్షంలో వారిని ఉగ్రవాద సానుభూతిపరులుగా పరిగణిస్తామని పేర్కొంది. ఈ మేరకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పేరు, లోగోతో ఉన్న కరపత్రాలను గాజా సరిహద్దు ప్రాంతాల ప్రజలకు పంపిణీ చేశారు. ‘గాజా నివాసితులకు అత్యవసర హెచ్చరిక. వాడి గాజాకు ఉత్తరాన ఉన్న మీ ప్రాణాలకు ప్రమాదం. ఉత్తర గాజాను వీడి దక్షిణ ప్రాంతానికి వెళ్లని వారిని తీవ్రవాద సంస్థ సహచరులుగా గుర్తిస్తాం’ అని ఆ కరపత్రంలో పేర్కొన్నారు. అలాగే మొబైల్ ఆడియో సందేశాలను కూడా గాజా స్ట్రిప్లోని ప్రజలకు ఇజ్రాయోల్ పంపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
కాగా, ఇప్పటికే గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఆర్మీ ఆ ప్రాంతంలో భూ దాడులకు సన్నద్ధమవుతున్నది. దీని కోసం ఇప్పటికే గాజా సరిహద్దులో సైనిక దళాలు, ట్యాంకులు, ఆయుధాలను భారీగా మోహరించింది.