సిద్దిపేట/నిజామాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టుమీద కొన్ని కుక్కలు మొరిగినప్పటికీ.. ఇప్పుడు ఎక్కడ చూసినా తెలంగాణ జలకళతో ఉట్టిపడుతున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దిగుబడి అధికంగా వచ్చేలా సేద్యం విధానాలు మారాలని పిలుపునిచ్చారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినం. దాని మీద కొన్ని కుక్కలు మొరిగినయ్. ఇంకా మొరుగుతునే ఉన్నయ్. ఇప్పుడేమైంది? మన దగ్గర యాడ పెద్దవాన పడలే. కానీ రాజరాజేశ్వర జలాశయంలో నీళ్లు దుంకుతున్నయ్. 9 వేల క్యూసెక్కుల ప్రాణహిత రాగానే పట్టి గుంజిపోస్తున్నం. నిన్ననే హరీశ్కు చెప్పిన అన్ని చెరువులు, కుంటలు నింపేయ్యిర్రి. వానకాలమైన నింపు ఏం గాదు. బుడబుడ కావాలె భూమంతా. పెద్ద వాన పడితే మళ్లీ మత్తడి దుంకుతయ్.. వొర్రెలు వంకలన్నీ పొంగిపొర్లినట్లే ఉండాలె. ప్రశాంత్రెడ్డిగారికీ చెప్పిన.. ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ నింపాలని. రంగనాయకసాగర్ నింపుకొని దాంతోని చెరువులు, కుంటలు చెక్డ్యాంలు మొత్తం నింపి పడేయండి. మంచిదే గదా! ఇగో గీ పనిచేస్తం. గిది కావాలె మనకు. ఎవ్వరేమన్న అనుకోనీ.. పనిచేసుకుంట పోతనే ఉండాలె. కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి నాలెక్కనే మొండి. ఆయన పనిచేస్కుంట పోతనే ఉంటడు. ఆయన మీద కూడా కేసులు పెట్టిన్రు. కానీ నేడు ఎలాంటి భారీ వర్షం లేకున్నా రాజరాజేశ్వర జలాశయం నిండుకుండలా ఉన్నది.
ఒకసారి మల్లన్నసాగర్ పూర్తయితే నెత్తిమీద కుండలాగా ఉంటుంది. పాత మెదక్ జిల్లాకు, జనగామ నియోజకవర్గానికి చాలా ఉపయోగపడుతుంది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టును కూడా త్వరగా పూర్తిచేయాలని అధికారులను నిన్ననే ఆదేశించిన. నేను బయల్దేరిన్నాడు ఎవరూ నమ్మలేదు. ఎవరెట్ల మాట్లాడినా బంగారు తెలంగాణదిశగా అడుగులు వేస్తా. నేడు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్, ట్యాంకర్, వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం ఇలా అనేక రకాలుగా చేసుకొన్నం. ప్రతి ఒక్కరి మొఖం మీద చిరునవ్వు చూడాలన్నదే ప్రభుత్వ సంకల్పం. నేను సీఎం అయినంక కట్టిన ప్రతి ప్రాజెక్టుకు దేవుని పేర్లు పెట్టాం. సరస్వతి, నంది, రాజరాజేశ్వర, రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ.. ఇవన్నీ పెట్టాలని నాకు ఎవరూ చెప్పలేదు, మనసులో ఉన్నది కాబట్టే పెట్టాం. మిడ్ మానేరు నాసిరకంగా కట్టామని అనేక రకాలుగా విమర్శలు చేసిన్రు. 28 టీఎంసీలు నేడు నిండి ఉన్నది.
నాసిరకంగా కడితే ఇపుడు ఉండేదా? మునుపు వర్షాలే పడకపోవు. వానలు కురిస్తే పటాకులు పేలినట్లు వేలల్లో చెరువులు తెగిపోతుంటే. సమైక్య పాలకులు నాడు పట్టించుకోలే. వాళ్లకు సంచులు మోసిన సన్నాసులు కూడా పట్టించుకోలేదు. వాళ్లు పట్టించుకుంటే తెలంగాణ గిట్లెందుకు ఉంటుండే. రెండేండ్లలో ఎక్సెస్ రెయిన్ఫాల్ పడింది. అయినా ఎక్కడా చెరువు కట్ట తెగలేదంటే మనం చేసుకున్న పనులే నిదర్శనం.
నాందేడ్, దెగ్లూర్ నుంచి వచ్చిండ్రు. టికెట్ ఇస్తే పోటీ చేస్తామన్నరు. నీలాంటి ముఖ్యమంత్రి మా దగ్గరుంటే బాగుందని అంటుండ్రు. ఇప్పుడు తీర్మానంచేసి తెలంగాణలో కలుపమంటున్నారు. ఇక్కడ పేదలను ఆదుకునే పద్ధతి, అన్నంపెట్టే పద్ధతి అద్భుతంగా ఉన్నది. ఏకే గోయల్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ప్లానింగ్ సెక్రటరీగా ఉండే. పెన్షన్లు ఎందుకిస్తున్నామని ఆయన్ని ఒక రోజు అడిగినా. ఎవ్వరికైతే అవసరం ఉన్నదో వారిని ఆదుకోవటానికి ఇస్తమన్నారు. అట్లా ఇస్తే పర్పస్ నెరవేరాలి కదా. రూ.200 ఇచ్చి ఇదే వైకుంఠమనుకో అంటూ పెట్టుకునేది. అది కరెక్ట్ కాదు. బతకడానికి రూ.200తో బువ్వ తినేదా! గోయల్, ఇతర నిపుణులంతా కలిసి చర్చించి 670 రూపాయలు చాలని చెప్పిండ్రు. కొసరు ఎందుకని నేను వేయి రూపాయలు చేసిన. ఇప్పుడు అదే రూ.2016 అందుతున్నది. ఇండియాలో ఎక్కడా ఒంటరి మహిళకు పెన్షన్ ఇస్తలేరు తెలంగాణలో తప్ప. దేశవ్యాప్తంగా 40 లక్షల మంది బీడీ కార్మికులున్నారు. 18 రాష్ర్టాల్లో ఉంటే మన రాష్ట్రంలోనే పెన్షన్ అందుతున్నది. ఎవడు గాయిగత్తర గాడు? ఎవరు పబ్లిక్ కోసం పని చేసేటోళ్లు? అనేది ప్రజలు గమనించాలి.
దళిత సోదరులు బాగా లేరు. వాళ్లపై సామాజిక వివక్ష జరిగింది. అదీ వాస్తవమే. నేను పక్కా హిందువును. యాగాలు చేసినా, పూజలు చేసినా. మడి కట్టుకుని చేస్తా. బాజాప్తా చేస్తా. ధర్మం ఆచరణ ఎవరిది వాళ్లది ఉంటది. కొంత మంది దొంగ పూజలు చేస్తారు. నాది అలా కాదు. ఊర్లలో దళితుల్లో దానయ్యలను ఒరేయ్ దానయ్యగా పిలిచి. డానియల్గా మారితే డానియల్ గారు అంటూ పిలవడం ద్వారానే తప్పు జరుగుతుంది. మనలోనే తప్పుంది. దళితులను పైకి తేవాలి. క్రమ పద్ధతిలో చేసి విజయం సాధించాలి. మంచి మనసుతో చేస్తే ఏదైనా అయితది. తెలంగాణ తెస్తానంటే ఎవడైనా నమ్మిండా! ఏమైంది.. కాలేదా? ఇది కూడా గ్యారెంటీగా అయితది. ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఆ సోయి ఉండాలె. సమాజాన్ని మంచి చేస్తమని బయలుదేరాం. మనపైనే బాధ్యత ఉంటది. ప్రత్యేకంగా ఈసారి సీఎం దళిత్ ఎంపవర్మెంట్ తెస్తున్నాం. పిచ్చి కరోనాతో వెనుకకు పోరాదు.. ముందుకు పోరాదు. నాక్కూడ కరోనా వచ్చింది. దానికి మందులేదు. మార్గం లేదు. 45 రోజులు లాక్డౌన్ పెడితే దెబ్బ పడింది. పన్నులు రావు. కరెక్ట్గా దెబ్బ పడుతది. ఆదాయం తగ్గుతుంది కానీ ఖర్చు తగ్గుతుందా! ఉల్టా ఖర్చు పడుతుంది. వచ్చే ఆదాయం రాదు. ఈ ఇబ్బంది మోపైంది.
సీఎం ప్రసంగిస్తున్న సమయంలో కరోనా ప్రస్తావన వచ్చింది.. ‘కరోనాతో నేడు మూతికో బట్ట కట్టుడూ.. పెండ్లిళ్లకు సార్ మాస్కు తీయి.. ఫొటోలకోసం అంటున్రు. ఎందుకంటే.. సార్ మళ్లీ మీరు దొరకరు! ఫొటోల కోసం మాస్కు తీస్తే నీకు దొరుకుతా. కానీ కరోనాకు కూడా దొరుకుత అటూఇటూ తాకి నాకు కూడా వచ్చింది కరోనా’ సీఎం అనగానే అక్కడున్న వారందరూ కడుపుబ్బ నవ్వారు.
25 తారీఖు నాడు డిస్కవరీ చానెల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నది నీళ్లను మళ్లించిన తీరును చూపిస్తరు. నదిని ఎట్లా పైకి తెస్తుండ్రు చూపిస్తరు. దాని మీద కూడా కొందరు మొరుగుతాండ్రు. వాళ్లను పట్టించుకో దల్చుకోలేదు. కరోనా మల్లా వస్తదంటున్నరు. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలె. మాస్కులు పెట్టుకొవాలి.